ఆంధ్రప్రదేశ్లో అర్హత ఉండి రేషన్ కార్డ్ లేకపోతే వాట్సాప్లో అప్లై చేస్తే సరి. కార్డు మీ ఇంటికే వచ్చేస్తుంది. 9552300009 వాట్సాప్ నెంబర్ కు హాయ్ అని మేసేజ్ చేసి ఈ సేవలు పొందవచ్చు. కాగా ఏపీ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మే 15 నుంచి వాట్సప్ గవర్నెన్స్లో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి ఆదేశించారు. మన మిత్ర కింద రేషన్ సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
అదే విధంగా రేషన్ కార్డులు కావాల్సిన వారు సచివాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 7వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్త బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదే విధంగా పాత కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.
అదే సమయంలో రేషన్ సరుకుల పంపిణీ, దీపం-2 పథకం అమలు, ధాన్యం సేకరణలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా…. అవకతవకలు జరగకుండా మొత్తం వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. ప్రజల్లో పూర్తి సంతృప్తి చెందేలా సేవలు అందించాల్సి ఉందన్నారు. ఎక్కడా రేషన్ బియ్యం రీ సైక్లింగ్ జరగకుండా చూడాలన్నారు. రైస్ కార్డులో పేర్లు నమోదైనప్పటికీ, జీఎస్డబ్ల్యుఎస్ డేటాలో లేని 79,173 మంది వివరాలపై వెంటనే పరిశీలన చేసి సరిచేయాలన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 1,46,21,223 రైస్ కార్డులు ఉండగా, అందులో 4,24,59,028 మంది సభ్యులున్నారు. వీరిలో ఇప్పటికే 3.94 కోట్ల మంది మాత్రమే ఈ కేవైసీ చేయించుకున్నారు. ఇంకా 23 లక్షల మంది ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంది. 0 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు, అలాగే 80 ఏళ్లకు పైబడిన వారికి ఈ కేవైసీ నుంచి మినహాయింపు ఇచ్చారు. వచ్చే నెల 30 కల్లా రాష్ట్రంలో అందరికీ ఈ కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. అలాగే, ఈ నెల 7 నుంచి కొత్త రైస్ కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీంతో పాటు స్ప్లిట్టింగ్, అడిషన్, డిలీషన్, సరెండర్, అడ్రస్ మార్పు, అప్డేషన్ వంటి 7 సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి విశేష స్పందన వస్తోంది.
గడిచిన ఖరీఫ్ సీజన్లో 35.94 లక్షల మెట్రిక్ టన్నులు, రబీ సీజన్లో 14.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి సేకరించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రైతులకు ఖరీఫ్లో రూ.8,278 కోట్లు, రబీలో రూ.3,076 కోట్లు ధాన్యం సేకరణ నిమిత్తం చెల్లించినట్టు తెలిపారు.