దారుణ ఉదంతం ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ప్రేమిస్తున్నానంటూ వెంట పడిన వ్యక్తి.. ఆమెను చిత్రహింసలకు గురి చేసి.. అత్యంత దారుణంగా హత్య చేసిన కిరాతక ఉదంతం యూపీలోని మొరాదాబాద్ లోని కొట్వాలి మైనథర్ గ్రామంలో వెలుగు చూసింది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
సైరా అనే యువతిని రఫీ అనే యువకుడు ప్రేమిస్తున్నట్లుగా పేర్కొంటూ వేధింపులకు గురి చేసేవాడు. అతడ్ని పట్టించుకోని ఆమె తన పని తాను చేసుకుంటూ పోయేది. తాజాగా పశువులకు మేత తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన సైరా తిరిగి రాలేదు. దీంతో.. ఆమె కోసం గాలింపులు జరపగా.. పంట పొల్లాల్లో రక్తపు మడుగులో ఆమె విగతజీవిగా పడిపోయి ఉంది. ఆమెను చిత్రహింసలకు గురి చేసి చంపినట్లుగా అక్కడి పరిస్థితులు ఉన్నాయి.
ఈ దారుణ హత్య సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సైరా మొబైల్ ఫోన్ లో ఐదు మిస్డ్ కాల్స్ ను గుర్తించిన వారు విచారణ చేపట్టారు. ఈ మిస్డ్ కాల్స్ గ్రామానికి చెందిన రఫీ అనే వ్యక్తి నుంచి రావటంతో.. అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైరా తల్లిదండ్రులు సైతం రఫీ తమ కుమార్తెను ప్రేమ పేరుతో అదే పనిగా వెంటపడేవాడని ఫిర్యాదు చేశారు. దీంతో.. రఫీని తమదైన శైలిలో విచారణ జరపగా.. అసలు నిజాలు బయటకు వచ్చాయి.
సైరాను ప్రేమిస్తున్నట్లుగా రఫీ పేర్కొన్నప్పటికి.. ఆమె అతడిని దూరం పెట్టింది. కొన్ని రోజుల క్రితం రఫీని మరో వ్యక్తిపై దాడి చేశాడు. దీనికి కారణం.. సదరు వ్యక్తితో సైరా రిలేషన్ షిప్ లో ఉందన్న అనుమానమే. దీంతో తన వేధింపుల్ని మరింత పెంచాడు. తాజాగా ఆమెను ఫాలో అయి. పంట పొలాల్లో మేతను కోసుకుంటగా స్క్రూడ్రైవర్ తో దాడి చేశాడు. విచక్షణ రహితంగా 18 సార్లు ఆమెను పొడిచేయటంతో ఆమె ప్రాణాలు వదిలేసింది. తనను విడిచి పెట్టాలంటూ ఆమె ఎంతలా వేడుకున్న ఆమెను రఫీ వదల్లేదని పోలీసులు చెబుతున్నారు. హత్య చేసిన తర్వాత ఇంటికి వెళ్లిన నిందితుడు స్నానం చేసి బట్టలు మార్చుకొని నిద్రపోయినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనంగా మారింది.