టాలీవుడ్ హీరో మంచు మనోజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భైరవం. యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తుండగా.. మనోజ్ కీలక పాత్రలో సందడి చేయనున్నారు. రీసెంట్ గా మేకర్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయగా.. ఆ సమయంలో తన AV చూసి ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత వేదికపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం మనోజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాను సిల్వర్ స్క్రీన్ పై కనిపించి తొమ్మిదేళ్లు అయిందని గుర్తు చేసుకున్నారు మంచు మనోజ్. ఎన్ని జన్మలు ఎత్తినా భైరవం డైరెక్టర్ రుణం తీర్చుకోలేనని తెలిపారు. తొమ్మిదేళ్ల గ్యాప్ లో ఎన్నో చిత్రాలు స్టార్ట్ చేశానని, అప్పుడే లాక్ డౌన్ వచ్చిందని, కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల పలు ప్రాజెక్టులు రద్దు చేసుకున్నానని చెప్పారు. సినిమా తప్ప తనకు ఏం తెలియదని అన్నారు.
“11 నెలల వయసప్పుడు గృహప్రవేశం మూవీలో యాక్ట్ చేశాను. ఆ తర్వాత 19 ఏళ్ల వయసులో దొంగ దొంగదిలో నటించాను. తొమ్మిదేళ్ల నుంచి మీకు (మూవీ లవర్స్ ) దూరంగా ఉన్నాను. కానీ నేనేం మీకు డబ్బులు ఇవ్వలేదు. ఏం చేయలేదు కూడా. కానీ నాపై ప్రేమ చూపిస్తున్నారు. మెసేజ్ లు కూడా పెడుతున్నారు” అంటూ ఎమోషనల్ అయ్యారు. “ముఖ్యంగా సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టే రోజుల్లో నన్ను దగ్గరకు తీసుకుని ప్రేమను పంచుతున్నారు. నేను మీ వల్ల చాలా ధైర్యంగా ఉంటున్నాను. నాకు ఇప్పుడు కేవలం భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లే నా ఫ్యామిలీ అని మీకు చూపిస్తాను. ఆ ధైర్యాన్ని ఇచ్చిన అందరికీ పాదాభివందనం” అంటూ భావోద్వేగానికి గురయ్యారు మనోజ్.
భైరవం మూవీలో యాక్ట్ చేయడం లక్ గా భావిస్తున్నట్లు తెలిపారు మనోజ్. “నేను ఇప్పటి వరకు గొప్ప గొప్ప సినిమాల్లో ఏం యాక్ట్ చేయలేదు. అయితే కావాలనుకుంటే భైరవం కోసం ఇతర సినీ ఇండస్ట్రీల నుంచి స్టార్ హీరోలను తీసుకొచ్చేవారు. కానీ డైరెక్టర్ నన్ను సెలెక్ట్ చేశారు. అందుకే ఆయనకు రుణపడి ఉంటాను” అని తెలిపారు. “నేను ఎన్నో ప్లాన్స్ చేశాను.. ఈవెంట్ అలా చేస్తా ఇలా చేస్తా అనుకున్నా. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు.. శివుడిని శివయ్యా అని పిలిస్తే రాడు.. శివుడిని మనసారా తలుచుకుంటే ఇలా డైరెక్టర్ రూపంలో.. నిర్మాత రూపంలో వస్తారు.. మీ అందరి (ఆడియన్స్) రూపంలో వచ్చేదే శివుడు” అంటూ భావోద్వేగంగా మాట్లాడారు మంచు మనోజ్. బెల్లంకొండ శ్రీనివాస్ తనకు తమ్ముడని, నారా రోహిత్ ప్రాణ స్నేహితుడని చెప్పారు.