టీడీపీ మహానాడు వేదికగా మంత్రి నారా లోకేశ్ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “అన్న, అక్కలు, తాతలుగా పోరాడిన కార్యకర్తల బలమే టీడీపీ స్థాయిని నిర్ధారించింది” అని చెప్పిన లోకేశ్, పార్టీ మార్పు అవసరం ఉందన్న తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. రాబోయే నాలుగు దశాబ్దాల తరం కోసం పార్టీని కొత్తగా తీర్చిదిద్దేందుకు మహానాడు చర్చలకు బలం చేకూర్చాలని సూచించారు.
ప్రతి కార్యకర్తను నాయకుడిగా చూస్తున్నామని చెప్పిన లోకేశ్, తోట చంద్రయ్య, మంజుల అక్క, అంజిరెడ్డి తాత వంటి నేతల దైర్య సాహసాలను ఉదాహరణగా ప్రస్తావించారు. “కత్తి మెడపై పెట్టినా ‘జై టీడీపీ’ అని గళమెత్తిన నేతలు ఈ పార్టీ స్ఫూర్తి,” అంటూ భావోద్వేగంగా స్పందించారు. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినదాన్ని గుర్తుచేస్తూ, పార్టీ తన కార్యకర్తలను మరచిపోదని హామీ ఇచ్చారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో తల్లులను అవమానించడం, సభలో మహిళలపై దాడులు జరిగిన సందర్భాల్ని ప్రస్తావిస్తూ “ఇంతకు మించి మైనస్ పబ్లిసిటీ ఏమీ ఉండదు” అన్నారు. “ఇవన్నీ చూసి ప్రజలు ఎలా స్పందించారో చూడండి, అర్థమైందా రాజా?” అంటూ జగన్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు. నాయకులు ప్రజల మధ్య ఉండాలని, అలాంటి వాళ్లనే పార్టీ ముందుకు తీసుకొస్తుందని స్పష్టం చేశారు.
“తెలుగుదేశం పార్టీ అన్నదాతకు భరోసా ఇచ్చిన పార్టీ, తెలుగు గర్వానికి నిలయంగా మారిన పార్టీ” అని లోకేశ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ పేదరిక నిర్మూలన లక్ష్యంగా పని చేస్తుందని గుర్తుచేశారు. “కోటి మంది సభ్యులతో గెలుపు బాటలో పరుగులు తీస్తోంది టీడీపీ” అని ధీమాగా తెలిపారు.