TDP Mahanadu 2025:కడపలో టీడీపీ (TDP) పార్టీ నిర్వహించే పసుపు పండుగకు సర్వం సిద్ధమైంది. కర్నూలు-కడప-చిత్తూరు జాతీయ రహదారిలోని రింగురోడ్డు వద్ద సువిశాలమైన 125 ఎకరాల్లో నేటి నుంచి మూడ్రోజుల పాటు టీడీపీ మహానాడు జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కడప నగరం ఫ్లెక్సీలు, బ్యానర్లతో పసుపు మయంగా మారింది. తెలుగు దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి సందర్బంగా మహానాడు నిర్వహించడం తెలుగు దేశం పార్టీలో ఆనవాయితీగా వస్తోంది. ప్రభుత్వంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా..టీడీపీ మహానాడుకు ప్రత్యేకంగా నిర్వహిస్తూ వస్తోంది.ఈ సారి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన జరగుతున్న తొలి మహానాడు కావడంతో తెలుగు దేశం శ్రేణులు ఎంతో ఉత్సాహాసంగా ఈ పండగలో పాల్గొంటున్నాయి. కడపలో జరిగే మహానాడుకు సోమవారం రాత్రి సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో చేరుకోగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ కుప్పం నుంచి రోడ్డు మార్గాన వచ్చారు. నాలుగు రోజులుగా మంత్రుల బృందం కడపలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
యేడాది పాలనలో బీజేపీ తెలుగు దేశం జనసే కూటమి సాధించిన విజయాలను చర్చించడంతోపాటు ప్రజాపాలనపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను మహానాడు వేదికగా చర్చించనున్నారు. కడపలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ వేడుక ద్వారా రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించే అవకాశముంది.
లోకేశ్ యువగళం పాదయాత్ర సమయంలో ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ను సవివరంగా చర్చించనున్నారు. మంగళవారం ఉదయం 8గంటల 30నిమిషాలకు ప్రతినిధుల నమోదు కార్యక్రమంతో మహానాడు ప్రారంభమవుతుంది. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో ఇది మొదలవుతుంది. ఉదయం 10గంటల 30నిమిషాలకు ఎగ్జిబిషన్ ప్రారంభిస్తారు. 10గంటల 45నిమిషాల నుంచి 11 గంటల వరకు పార్టీ అధ్యక్షుడు, పొలిట్బ్యూరో సభ్యులు ఇతర ముఖ్య నాయకులను వేదికపైకి ఆహ్వానించి పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలతో చర్చించనున్నారు. మూడు రోజులు పాటు జరగనున్న ఈ వేడుకలో పార్టీ నేతలకు కార్యకర్తలకు రకరకాల వంటలతో విందు ఏర్పాటు చేశారు.
మహానాడు అంటేనే.. పసుపు పండగ. ఇంకా చెప్పాలంటే తెలుగు తమ్ముళ్లకు అతి పెద్ద పండగ. అలాంటి పండగకు కడప నగరం ముస్తాబు అయింది. ఈ పండగ ఈ రోజు.. అంటే మంగళవారం ప్రారంభం కానుంది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ పండగ అంగరంగ వైభవంగా జరగనుంది.తెలుగుదేశం పార్టీని హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున స్థాపించడమే కాదు.. పార్టీ పెట్టిన జస్ట్ 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకుని.. దేశ రాజధాని హస్తినలోని నాటి హస్తం పార్టీ పెద్దల వెన్నులో వణుకు పుట్టించిన కథానాయకుడు ప్లస్ మహానాయకుడు నందమూరి తారక రామారావు. అలాంటి మహానీయుడు స్థాపించిన పార్టీ ఆయన జన్మదినం వేళ మరోసారి కడప వేదికగా మహానాడు పేరుతో మురిసిపోతుంది.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాక ముందు అంటే.. 1982లో ఏప్రిల్ 10, 11వ తేదీలలో హైదరాబాద్లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్లో ఈ మహానాడు సభను తొలిసారిగా నిర్వహించారు.అదే ఏడాది 1982, మే 27, 28 తేదీలలో తిరుపతి త్యాగరాజ మండపంలో మహానాడు పేరుతో మరో సభను నిర్వహంచారు.అయితే మహానాడును పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జన్మదినం మే 28వ తేదీన నిర్వహించాలని పార్టీలోని పెద్దలు నిర్ణయించారు. దీంతో ఆ ప్రాతిపదికగా ఈ మహానాడును నిర్వహిస్తున్నారు.ఇక టీడీపీ పాలన పగ్గాలు అందుకున్న తర్వాత విజయవాడ వేదికగా.. 1983, మే 26, 27, 28 తేదీలలో ప్రధమ మహానాడు నిర్వహించారు. ఈ మహానాడుకు జాతీయ పార్టీల అగ్రనేతలు ఎం జీ రామచంద్రన్, ఫరూక్ అబ్దుల్లా, ఎల్.కె. అద్వానీ, చండ్ర రాజేశ్వరరావు, మేనకా గాంధీ, రామకృష్ణ హెగ్డే, మాకినేని బసవ పున్నయ్య తదితరులు హాజరయ్యారు.
1984లో విశాఖపట్నంలోని పోలీసు గ్రౌండ్స్లో మహానాడు నిర్వహించారు.
1986లో హైదరాబాద్లోని గండిపేటలో మహానాడు చేపట్టారు.
1987లో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మహానాడు నిర్వహించారు.
1988లో విజయవాడ వేదికగా మహానాడు నిర్వహించారు.
అయితే.. 1985,1989, 1991, 1995,1996, 1997, 2008, 2012, 2019, 2024 సంవత్సరాల్లో మహానాడును టీడీపీ నిర్వహించ లేదు.
ఇక 2020-21లో కరోనా విజృంభించింది. ఈ కారణంగా తెలుగుదేశం పార్టీ మహానాడును డిజిటల్ పద్దతిలోకి మార్చి పార్టీ నేతలు నిర్వహించారు.
2022 మే 27, 28 తేదీలలో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు వేదికగా మహానాడు నిర్వహించారు. ఈ మహానాడుతో తెలుగుదేశం పార్టీకి సరికొత్తగా నేతలు ఊపిరిలూదారు. ఇంకా చెప్పాలంటే.. నాటి సీఎం వైఎస్ జగన్పై ప్రత్యక్ష మాటల యుద్దానికి ఈ మహానాడు వేదికపై నుంచే పార్టీ నేతలు సమర శంఖం పూరించారు. ఆ క్రమంలో ఈ మహానాడు ద్వారా గత సీఎం వైఎస్ జగన్కు టీడీపీ నేతలు సవాల్ విసిరారు. ఈ మహానాడు సక్సెస్ కాదు.. సూపర్ డూపర్ సక్సెస్ అయింది. దీంతో మళ్లీ అధికారానికి చేరువ కాబోతున్నామనే సంకేతాలు.. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు స్పష్టంగా అందాయి.2023 రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు తెలుగుదేశం పార్టీ సైతం సూపర్ సక్సెస్ అయింది. అంతేకాదు. 2024లో జరగనున్న ఎన్నికల ప్రణాళికలకు ఈ మహానాడు వేదికగానే అంకురార్పణ జరిగింది. సూపర్ సిక్స్, ఇతర సంక్షేమ పధకాల వివరాలను ఈ రాజమహేంద్రవరం మహానాడులో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
2024 ఎన్నికలలో కూటమి ఘన విజయం సాధించింది. దీంతో సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. దాంతో అధికారిక హోదాలో 2025 టీడీపీ మహానాడు .. అది కూడా వైఎస్ జగన్ సొంత ఇలాకా కడపలో నిర్వహిస్తున్నారు. మే 27, 28 తేదీలలో ప్రతినిధులతో సభలు.. అలాగే మే 29వ తేదీన అంటే చివరి రోజు.. నిర్వహించే సభకు దాదాపు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
తెలుగుదేశం పార్టీకి మహానాడు రాజకీయంగా జీవం పోస్తుంటే.. పార్టీ కార్యకర్తలకు నేతలకు, కొత్త ఊపిరిని ఇస్తుంది. ఈ మహానాడు పార్టీ ఆవిర్భావం నుంచి కేవలం పదేళ్లు మినహా.. మిగిలిన అన్ని సందర్భాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలుగుదేశం స్థాపించిన తర్వాతే సామాన్యులకు సైతం రాజకీయాలు ఎలా ఉంటాయనేది అర్దమైందనే విషయం అందరికి తెలిసిందే. అందుకే తెలుగుదేశం పార్టీ ప్రజల మనస్సుల్లో నిత్యం నిలిచి ఉందంటే.. అందుకు మహానాడు కార్యక్రమం నిర్వహణ కూడా ఒకటన్నది సుస్పష్టం. తెలుగుదేశం పార్టీ సక్సెస్కు మహానాడు ఒక టాప్ సీక్రెట్.