భారత్ లో అయితే కోట్లాది మంది అభిమానులు… ఏ నగరంలోనూ స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి.. వ్యక్తిగత జీవితం ఓ జైలు జీవితం తరహా.. అందుకేనేమో క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి తన నివాసానికి వేరే దేశం ఎంచుకున్నాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కోహ్లి కొంతకాలంగా యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)లోనే ఎక్కువగా ఉంటున్నాడని కథనాలు వచ్చాయి. తన భార్య అనుష్క శర్మ రెండో కాన్పు కూడా అక్కడే జరిగింది. టోర్నమెంట్లు లేనప్పుడు కోహ్లి అధిక సమయం యూకేలో గడిపేందుకే ఇష్టపడుతున్నాడనేది స్పష్టమైంది.
అక్కడి వాతావరణమో.. మెరుగైన జీవనమో.. స్వేచ్ఛ కోసమో.. మరేదైనా కానివ్వండి.. కోహ్లి యూకే పట్ల ఆపేక్షతో ఉన్నాడని తెలుస్తోంది. ఓవైపు అదే యూకే (ఇంగ్లండ్)కు చెందిన జట్టు భారత్ లో పర్యటిస్తుంటే, కోహ్లి తన భార్య కాన్పు కోసం సిరీస్ కు పూర్తిగా దూరమయ్యాడు. అప్పట్లోనే కోహ్లి ఇంగ్లండ్ ను తన రెండో ఇల్లుగా చేసుకుంటాడనే కథనాలు వచ్చాయి. యూకేకు గత ఏడాది వరకు ప్రధాని పనిచేసిన, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి అల్లుడైన రిషిసునాక్ తోనూ కోహ్లి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సీజన్ లో ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్ కు చేరడతో సునాక్ ఇండియాకు వచ్చి మరీ మ్యాచ్ ను వీక్షించారు.
అయితే, తాను ఎంతగానో ఇష్టపడుతున్న ఇంగ్లండ్ లో పర్యటనకు ముందు, తాను ఎంతగానో ఇష్టపడే టెస్టు ఫార్మాట్ కు కోహ్లి గుడ్ బై చెప్పి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇక టీమ్ ఇండియా ప్రస్తుతం ఇంగ్లండ్ లో ఉంది. శుక్రవారం నుంచి తొలి టెస్టు మొదలుకానుంది. కొత్త కెప్టెన్ శుబ్ మన్ గిల్ సారథ్యంలో టీమ్ ఇండియా ఐదు మ్యాచ్ ల సమరానికి సిద్ధం అవుతోంది. మరో స్టార్ బ్యాట్స్ మన్, మొన్నటివరకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు. కోహ్లి, రోహిత్ ఇద్ధరిలో ఒక్కరైనా లేకుండా 15 ఏళ్లలో తొలిసారిగా టీమ్ ఇండియా ఓ విదేశీ టూర్ చేస్తోంది.
కాగా, టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన కోహ్లి కూడా తాజాగా ఇంగ్లండ్ చేరాడు. సహచర క్రికెటర్లు శుబ్ మన్ గిల్, రిషభ్ పంత్ తదితరులను లండన్ లో తన భారీ బంగ్లాకు ఆహ్వానించాడు. వారు కొన్ని గంటల పాటు అక్కడ గడిపినట్లు తెలిసింది. బహుశా వన్డే క్రికెట్ లో మాత్రమే కోహ్లి కొనసాగుతున్నందున అతడు ఇప్పుడు ఇంగ్లండ్ లోనే ఉంటూ టెస్టు సిరీస్ ను చూసే చాన్సుంది. పూర్తిగా రిటైర్ అయినాక కూడా కోహ్లి ఎక్కువ కాలం లండన్ లోనే నివసించే అవకాశం కనిపిస్తోంది.