ప్రియుడి కోసం కట్టుకున్న భర్తలకు కడతేర్చుతున్న భార్యలకు సంబంధించిన ఘటనలు వరుసగా హల్ చల్ చేస్తోన్న వేళ.. తాజాగా డబ్బుల కోసం బాయ్ ఫ్రెండ్ ను కిడ్నాప్ చేయించి, చిత్ర హింసలకు గురించేసి, అతడి కుటుంబ సభ్యులకు కాల్ చేసి పెద్ద మొత్తంలో నగదు డిమాండ్ చేసిన గర్ల్ ఫ్రెండ్ వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో.. ఈ స్క్రిప్ట్ మామూలుగా లేదనే మాటలు వినిపిస్తున్నాయి.
అవును… డబ్బు కోసం ఓ మహిళ తన బాయ్ ఫ్రెండ్ ను కిడ్నాప్ చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దుబాయ్ కు చెందిన ఓ ట్రావెల్ సంస్థకు మేనేజర్ గా పని చేస్తున్న లారెన్స్ మెల్విన్ ను అతడి గర్ల్ ఫ్రెండ్ మహిమావత్ ఇటీవల బెంగళూరులో కిడ్నాప్ చేయించింది. అనంతరం రూ.2.5 కోట్లు డిమాండ్ చేసింది. దీంతో… అతడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
వివరాళ్లోకి వెళ్తే… దుబాయ్ కు చెందిన ట్రావెల్ సంస్థలో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న లారెన్స్ మెల్విన్ (37).. ఇటీవల తన కుటుంబ సభ్యులు నివసిస్తున్న బెంగళూరుకు వచ్చారు. ఈ క్రమంలో… జులై 16 నుంచి తమ కుమారుడు కనిపించట్లేదని లారెన్స్ తల్లి అశోక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో… కిడ్నాపర్లు ఫోన్ చేసి రూ.2.5 కోట్లు ఇవ్వాలని బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు! దీంతో.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. అతడి గర్ల్ ఫ్రెండ్ ఈ కిడ్నాప్ కు పథకాన్ని రచించిందని గుర్తించారు. ఈ సందర్భంగా… సెలవుపై దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చిన లారెన్స్.. రెసిడెన్సీ రోడ్ లోని ఒక హోటల్ లో బస చేశారని.. ఈ క్రమంలో జులై 14న అతడి ప్రియురాలు మహిమా బయటకు వెళ్దామని ఆహ్వానించడంతో ఓ కారు బుక్ చేసుకొని వెళ్లారని పోలీసులు తెలిపారు.
ఈ సమయంలో… కొంతదూరం వెళ్లిన తర్వాత, డ్రైవర్ కారును మరో మార్గంలో తీసుకువెళ్లగా అక్కడ మరో ఇద్దరు వ్యక్తులు కారులోకి ఎక్కి లారెన్స్ పై దాడి చేశారని.. అతడి వద్ద ఉన్న రూ.లక్ష నగదు లాక్కొని ఓ అపార్ట్ మెంట్ లో బంధించారని తెలిపారు. ఈ క్రమంలో సుమారు వారం రోజులకు పైగా అతడిని చిత్రహింసలకు గురి చేసినట్లు వెల్లడించారు. అనంతరం.. అతడి కుటుంబ సభ్యులకు కాల్ చేసిన దుండగులు.. రూ.2.5 కోట్లు డిమాండ్ చేశారని.. అయితే, అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న ఓ మహిళ నిందితుల తీరు అనుమానాస్పదంగా ఉండడం గమనించి.. వారు లేని సమయంలో బాధితుడిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించిందని తెలిపారు. ఆ సమాచారంతో స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లారెన్స్ ను రక్షించారు. ఈ క్రమంలో.. ఆర్టి నగర్ కు చెందిన మహ్మద్ ఆసిఫ్ రిసల్దార్ (42), మహ్మద్ సోహైల్ షేక్ (25), డిజె హళ్లికి చెందిన సల్మాన్ పాషా (22), కెజి హళ్లికి చెందిన మహ్మద్ నవాజ్ (27) లను అదుపులోకి తీసుకోగా… మహిమా సహా మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.