నిన్న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి రాష్ట్రంలో శాంతిని మరోసారి కలవరపెట్టింది. అనంతనాగ్ జిల్లాలోని బైసరన్ మైదానంలో సందర్శకులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో 26 మంది, ప్రధానంగా పర్యాటకులు, ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని లష్కర్-ఇ-తోయిబా అనుబంధ సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహించింది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో పర్యాటక రంగం గణనీయంగా వృద్ధి చెందుతున్న సమయంలో ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ దాడి కాశ్మీర్ను మళ్లీ అశాంతిలోకి నెట్టివేస్తుందా అన్న ప్రశ్న సమాజంలో తలెత్తుతోంది. ఈ ఘటన రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిపై దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఈ దాడి కాశ్మీర్లో ఇటీవలి సంవత్సరాల్లో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జరిగింది. గతంలో 2019 పుల్వామా దాడి, 2000లో చిత్తిసింగ్పురా ఊచ్చకోత వంటి ఘటనలు రాష్ట్రంలో భీతిని రేకెత్తించాయి. పహల్గామ్ దాడి కూడా ఇలాంటి భయానక గతాన్ని గుర్తుచేస్తోంది. ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో శాంతి, పురోగతి సందేశాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన తర్వాత జమ్మూ కాశ్మీర్లో బంద్కు పిలుపునిచ్చిన రాజకీయ పక్షాలు, ప్రజలు ఈ దాడిని ఖండించాయి. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ వంటి దేశాల నాయకులు కూడా ఈ దాడిని ఖండిస్తూ భారత్కు సంఘీభావం తెలిపారు.
పహల్గామ్ దాడి కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కీలకమైన స్తంభంగా మారిన నేపథ్యంలో, ఈ ఘటన పర్యాటకులలో భయాందోళనలను రేకెత్తించవచ్చు. స్థానిక వ్యాపారాలు, గుర్రపు సవారీ ఆపరేటర్లు, హోటల్ యాజమాన్యాలు ఈ దాడి తర్వాత ఆర్థిక నష్టాలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఈ ఘటన రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను కూడా ప్రభావితం చేయవచ్చు, ఎందుకంటే ఇటీవలి సంవత్సరాల్లో దుబాయ్ ఆధారిత ఈమార్ గ్రూప్ వంటి సంస్థలు కాశ్మీర్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాయి. ఈ దాడి రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు గణనీయమైన అడ్డంకిగా మారవచ్చు.సౌదీ పర్యటనలో ఉన్న మోదీ అకస్మాత్తుగా తన పర్యటన రద్దు చేసుకొని ఈరోజు ఉదయం భారత్ చేరుకోనున్నారు. మంగళవారం పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడికి సంబంధించి ఎమర్జెన్సీ మీటింగ్ కూడా నిర్వహించనున్నారు. మృతుల్లో ఎక్కువ శాతం టూరిస్టులు కావడం ఆందోళనకు దారితీస్తుంది. ఇందులో ఇద్దరు విదేశీయులు, ఇద్దరు స్థానికులు ఉన్నారు..
ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఇప్పటికే ఆ ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ కూడా నిర్వహించారు. డాగ్స్, డ్రోన్లు, హెలికాప్టర్లను కూడా ఉపయోగించారు. సీఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఆర్మీతో పాటు జమ్ము కాశ్మీర్ పోలీసులు కూడా పూర్తిస్థాయిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అయితే జూలై 3న ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు ముందుగానే ఈ ఉగ్ర దాడి జరగడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు పర్యాటకులు. కాశ్మీర్లో పర్యటకుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఉగ్రదాడికి తెగబడ్డారు.అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ ఉగ్ర దుశ్చర్యను ఖండించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ ఈ మేరకు ట్వీట్ చేశారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెంటనే ప్రధాని మోదీకి ఫోన్ చేశారని జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదుశ్చర్యపై ఆరా తీశారు. అమాయక ప్రజలు మరణించడం పట్ల తాను ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్తో కలిసి పోరాడతామన్నారు. ఈ నేపథ్యంలో భారత్కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారని రణధీర్ ట్విట్ చేశారు.
అధ్యక్షుడు పుతిన్ కూడా ఈ ఉగ్రదాడిపై స్పందించారు. చనిపోయిన వారికి ప్రగాఢ సానుభూతి చెబుతున్నట్లు ఆయన రాసుకొచ్చారు. ఈ దాడిలో అమాయక ప్రజలు చనిపోవడం దారుణం అన్నారు.అంతకు ముందే ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ ఉగ్రదాడి తనను కలిసి వేసిందని ఈ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆయన ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇక ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన నిఘా విభాగం అధికారి మనీష్ రంజాన్ సైతం చనిపోయారు. ఇది ఇలా ఉండగా కాశ్మీర్ టూర్ వెళ్లిన ఆరుగురు వైజాగ్ వాసులు కూడా మిస్సింగ్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాండురంగపురం వాసుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. విశాఖ పాండురంగపురానికి చెందిన మూడు కుటుంబాలు కాశ్మీర్ పర్యటనకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి తో పాటు మరో రెండు జంటలు మిస్ అయ్యాయి.
కశ్మీరు లోయలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో మంగళవారం పచ్చికబయళ్లలో తిరుగుతూ ప్రకృతి అందాలను చూసి పరవశిస్తున్న పర్యాటకులపై హఠాత్తుగా దాడికి తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసారన్ ప్రాంతంలోని కొండల మధ్యనున్న మైదాన ప్రాంతంలో పర్యటిస్తున్న వారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పచ్చని కొండల్లో నెత్తుటేర్లు పారించారు. ముష్కరుల దాడిలో 26 మంది మరణించారు. మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. మృతుల్లో ఇద్దరు విదేశీయులు (ఇజ్రాయెల్, ఇటలీ దేశస్థులు), ఇద్దరు స్థానికులు, పలు రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో బైసారన్ ప్రాంతంలో ఉల్లాసంగా తిరుగుతున్న 40 మందికి పైగా పర్యాటకులను సమీప అడవిలో నుంచి వచ్చిన ఉగ్రవాదులు చుట్టుముట్టారు. లోయ అందాలను ఆస్వాదిస్తున్న వారిపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలగా.. చాలామంది తీవ్ర గాయాలపాలయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. తమ వారిని కాపాడాలంటూ పలువురు విజ్ఞప్తి చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉండడంతో బాధితులను తరలించడం కష్టమైంది. బైసారన్లో కాల్పుల శబ్ధం వినిపించడంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా స్థలానికి తరలివెళ్లాయి. గాయపడిన వారిని హెలికాప్టర్ల ద్వారా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే స్థానికులు గుర్రాల సాయంతో పలువురిని తీసుకెళ్లినట్లు సమాచారం. తొలుత మృతుల సంఖ్య తక్కువగానే ఉన్నట్లు పేర్కొన్నప్పటికీ.. తర్వాత 26కి చేరినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
దాదాపు ఐదుగురు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ‘‘నా భర్త తలలోకి తుపాకీ గుండు దూసుకెళ్లింది. మరో ఏడుగురు కూడా తీవ్రంగా గాయపడ్డారు’’ అని ఓ మహిళ పీటీఐ వార్తా సంస్థకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి, కాపాడాలని వేడుకున్నారు. ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించగానే భయంతో పరుగులు తీసినప్పటికీ.. పెద్ద మైదాన ప్రాంతం కావడంతో తప్పించుకోవడానికి దారిలేకపోయిందని మరో మహిళ చెప్పారు. ఉగ్రవాదులు పేరు అడిగి మరీ కాల్చి చంపారని మరో మహిళ వెల్లడించారు. బైసారన్లో ఉగ్రదాడి జరిగిన సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నారు. దాడిలో మరణించిన, గాయపడిన వారి కుటుంబ సభ్యులను పటిష్ఠ భద్రత నడుమ పహల్గాం క్లబ్కు తరలించారు. అనంతనాగ్ జిల్లా యంత్రాంగం, పోలీసులు, అంబులెన్సులను ఘటనా స్థలానికి రప్పించారు. సైనికులు, సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు బైసారన్ చేరుకున్నారు. పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ముష్కరులను మట్టుబెట్టేందుకు సమీప అటవీ ప్రాంతాన్ని భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి. పెద్దఎత్తున ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ను చేపట్టాయి. ఉగ్రదాడికి సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు గాను అనంతనాగ్, శ్రీనగర్లో అత్యవసర కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఓ వైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనలో ఉండగా మరోవైపు ప్రధాని మోదీ సౌదీ పర్యటనకు వెళ్లిన సమయంలో కశ్మీరులో పర్యాటకులపై ఉగ్రమూకలు దాడులకు పాల్పడడం గమనార్హం.
ఉగ్రదాడిలో హైదరాబాద్కు చెందిన వ్యక్తి మృతి చెందారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి మనీశ్ రంజన్ కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. బైసారన్ పర్యటనలో ఉండగా.. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆయన మృతి చెందినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత నౌకాదళ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్(26) కూడా మరణించినట్లు అధికారులు తెలిపారు. హరియాణాకు చెందిన వినయ్కు కోచిలో పోస్టింగ్ ఇచ్చారు. ఈ నెల 16న ఆయనకు వివాహమైనట్లు అధికారులు చెప్పారు. కశ్మీరు పర్యటనకు వెళ్లిన ఆయన ఉగ్రదాడిలో మరణించారు.ఈ ఉగ్రదాడి తమ పనేనని ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)’ సంస్థ ప్రకటించింది. పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా నుంచి టీఆర్ఎఫ్ ఉద్భవించింది. జమ్మూకశ్మీరులో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇది పుట్టుకొచ్చింది. లష్కరేకు చెందిన సాజిద్ జట్, సజ్జద్ గుల్, సలీం రెహ్మానీ టీఆర్ఎ్ఫకు నాయకత్వం వహిస్తున్నారు. 2023 జనవరిలో కేంద్ర హోం శాఖ ఈ సంస్థపై నిషేధం విధించింది
కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం రాత్రికి శ్రీనగర్ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్భవన్కు వెళ్లారు. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, నిఘా విభాగం డైరెక్టర్ తపన్ డేకాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీరు డీజీపీ నళిన్ ప్రభాత్ పహల్గాం ఉగ్ర దాడి వివరాలను తెలియజేశారు. పహల్గాంలో పరిస్థితిపై ఉన్నతాధికారులతో షా సమీక్షించారు. బుధవారం ఆయన ఘటనా స్థలానికి వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి.బైసారన్లో ఉగ్రదాడి ఘటన తెలిసి షాక్కు గురైనట్లు జమ్మూకశ్మీరు సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. పర్యాటకులపై కాల్పులకు తెగబడడం అత్యంత హేయమైన చర్య అని, వారు జంతువులని పేర్కొన్నారు. ఈ దాడిని ఖండించడానికి ఇంతకంటే మాటలు రావడం లేదన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల సంఖ్య పెరుగుతోందని, ఆ వివరాలను ఇప్పుడే చెప్పలేమని ఎక్స్లో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో జమ్మూకశ్మీరులో పౌరులపై నేరుగా జరిగిన అతిపెద్ద ఉగ్ర దాడి ఇదేనన్నారు.
అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న వేళ.. ఈ ఉగ్రదాడి జరగడం గమనార్హం. 38 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. లక్షలాది మంది యాత్రికులు రెండు మార్గాల్లో ఇక్కడకు చేరుకుంటారు. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం మార్గంలోనే యాత్ర 48 కి.మీ. మేర ఉంది. 14 కి.మీ. మార్గం గండేర్బల్ జిల్లా మీదుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడడం ఆందోళన కలిగిస్తోంది.ఉగ్రవాదుల దాడిలో కర్ణాటకకు చెందిన స్థిరాస్తి వ్యాపారి మంజునాథ రావు మరణించారు. ఆయన భార్య పల్లవి, ఎనిమిదేళ్ల కుమారుడు క్షేమంగా ఉన్నారు. కశ్మీరు పర్యటనకు వెళ్లిన పలువురు కన్నడిగులు ప్రమాదంలో ఉండడంతో సీఎం సిద్దరామయ్య అప్రమత్తమయ్యారు. మంగళవారం సాయంత్రం సీఎస్, పోలీసు ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. కర్ణాటక వాసులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు అధికారులను వెంటనే కశ్మీరుకు పంపారు. ఉగ్రదాడిలో మరణించిన మంజునాథ శివమెగ్గలోని విజయ్నగర్ వాసి. భార్య, కుమారుడితో కలిసి ఈ నెల 19న కశ్మీరు పర్యటనకు వెళ్లారు.
పహల్గాం ఉగ్రదాడి బాధ్యులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని జమ్మూకశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు. ఈ దాడిపై యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోందని, మన బలగాల రక్తం మరిగిపోతోందని పేర్కొన్నారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు మన బలగాలు రంగంలోకి దిగాయన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.‘‘పో.. ఇక్కడి జరిగింది మోదీకి చెప్పు’’.. నన్ను కూడా చంపేయండి అని తన భర్తను చంపిన ఉగ్రవాదుల ఎదుట రోదించిన మహిళకు ఓ ఉగ్రవాది ఇచ్చిన సమాధానమిది. కర్ణాటకలోకి షిమోగకు చెందిన మంజునాథ్, పల్లవి, తమ కుమారుడు అభిజయ్తో కలిసి కశ్మీరు పర్యటనకు వెళ్లి పహల్గాం సందర్శనకు వెళ్లగా.. మంజునాథ్ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ‘‘ముగ్గురు, నలుగురు మాపై దాడి చేశారు. నా కళ్ల ముందే నా భర్తను కాల్చారు. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నా భర్తను చంపారుగా నన్ను కూడా చంపేయండి.. అని వాళ్లని అడిగా.. మేము నిన్ను చంపం.. పోయి ఇక్కడ జరిగింది మోదీకి చెప్పు.. అని వాళ్లలో ఒకరు బదులిచ్చారు’’ దాడి అనంతరం పల్లవి చెప్పిన మాటలివి.