వైసీపీ ప్రభుత్వంలో తమకు తిరుగే లేదన్నట్లుగా వ్యవహరించిన నేతలు ఒకరు తర్వాత ఒకరుగా అరెస్టు అవుతున్నారు. తాజాగా ఆ జాబితాలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 55 రోజులుగా అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు ఏపీ పోలీసులు కిందా మీదా పడినా అతడి ఆచూకీ కనిపెట్టే విషయంలో ఏపీ పోలీసులు ఫెయిల్ అవుతూ వచ్చారు. తాజాగా బెంగళూరు సమీపంలోని ఒక పల్లెటూరిలోని రిసార్ట్ లో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసుల్ని ఆయన్ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు ప్రకటించారు.
ఇంతకూ ఏ కేసులో మాజీ మంత్రి కాకాణి అరెస్టు అయ్యారు? అన్న విషయంలోకి వెళితే.. క్వార్జ్ అక్రమ తవ్వకాలు.. అక్రమ రవాణా.. నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం.. అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడటం లాంటి నేరారోపణలు ఆయనపై ఉన్నాయి. నెల్లూరుజిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ఏ4గా కాకాణి ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసు విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఆయన పట్టించుకోలేదు. అనంతరం నిందితుడిగా (ఏ4) ప్రకటించిన తర్వాత కూడా ఆయన వెనక్కి తగ్గలేదు.
ఈ కేసులో అరెస్టు ఖాయమన్న విషయంపై అవగాహన వచ్చినంతనే.. కాకాణి కనిపించకుండా పోయారు. అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా ఆచూకీ లభించలేదు. అదే సమయంలో తాను బయటకు రాకుండా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టు.. సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే.. ఆయా న్యాయస్థానాలు ఆ పిటిషన్లను కొట్టేశాయి. కాకాణి మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆయన కన్ను పడితే ఎలాంటి మైన్ అయినా.. దాని లీజుదారు ఎవరైనా సరే రాజీకి రావటం.. ఆయనకు సమర్పించుకోవటం తప్పనిసరి అన్నట్లుగా చెబుతారు.
నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేయటం.. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాల్ని వినియోగించటం.. అందుకు అభ్యంతరం చెప్పే వారిని తనదైన శైలిలో బెదిరింపులకు గురి చేయటం లాంటివి కాకాణికి వెన్నతో పెట్టిన విద్యగా చెబుతారు. ఆయన తీరును నిరసిస్తూ అప్పట్లో సీనియర్ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్ష చేపడితే.. ఆయనపైకి వైసీపీ నేతల్ని.. హిజ్రాలు.. రౌడీలను ఉసిగొల్పిన వైనం అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో మరింత మొండిగా కాకాణికి వ్యతిరేకంగా సోమిరెడ్డి పని చేశారు.
అతడి అక్రమ తవ్వకాల గురించి కలెక్టర్.. ఎస్పీ మొదలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. డీజీపీ.. ప్రధానమంత్రి.. కేంద్ర మంత్రి వరకు పలుమార్లు కంప్లైంట్లు చేశారు. దీంతో.. గత ఎన్నికలకు కాస్త ముందు గనులు.. రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి. కాకాణి మొత్తంగా 61,313 టన్నుల క్వార్జ్ ను అక్రమంగా తవ్వేసినట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి ఫైన్ గా రూ.7.56 కోట్లు చెల్లించాలని షోకాజ్ నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు. ఈ అంశంపై అధికారులు కంప్లైంట్ చేయటంతో పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లగా అక్కడ లేరు. దీంతో ఇంటికి నోటీసులు అతికించి వచ్చేవారు. అందులో పేర్కొన్నట్లుగా మార్చి 31న పోలీసుల ఎదుట హాజరుకాలేదు. అనంతరం రెండుసార్లు ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు రాలేదు. ఆ గడువు ముగిసిన తర్వాత నుంచి పోలీసులకు కనిపించకుండా పోయారు. హైదరాబాద్.. తమిళనాడు.. కేరళ.. కర్ణాటక రాష్ట్రాల్లో కొన్నిరోజులు తలదాచుకున్న ఆయన.. మరింత రిమోట్ లోకి వెళ్లిపోయారు. తాజాగా బెంగళూరుకు సమీపంలోని ఒక పల్లెటూరు రిసార్ట్స్ లో దాక్కోవటం.. అతడి జాడను గుర్తించిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకోవటంతో కాకాణి కథ ప్రస్తుతానికి పోలీసు లాకప్ వరకు చేరింది. తర్వాత ఏమవుతుందో చూడాలి.