సుప్రీంకోర్టు.. హైకోర్టు న్యాయమూర్తులను తొలగించేందుకు అభిశంసన తీర్మానాన్ని పెట్టాల్సి ఉంటుందంటూ పుస్తకాల్లో చదవి ఉంటాం. వాస్తవానికి సమకాలీన కాలంలో అలాంటి సన్నివేశాన్ని చూసిన దాఖలాలు లేవు. ఇప్పుడు అలాంటి సన్నివేశం ఆవిష్క్రతం కానుందా? అన్నదిప్పుడు చర్చగా మారింది. దీనికి కారణం..కొద్ది రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (ప్రస్తుతం ఆయన అలహాబాద్ హైకోర్టు జడ్జిగా వ్యవహరిస్తున్నారు) ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదం.. అనంతరం వెలుగు చూసిన షాకింగ్ అంశాలు గుర్తుండే ఉంటాయి.
భారీగా నోట్ల కట్టలు అగ్నిప్రమాదం సందర్భంగా ఆయన అధికార నివాసంలో గుర్తించారు. అయితే.. ఈ అంశాలపై వివరాలు బయటకు రాలేదు. గుట్టుచప్పుడుగా ఉండిపోయినప్పటికీ.. మీడియా.. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ అంశాలు వెలుగు చూడటం.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే. దేశ రాజధానిలో ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో పెద్ద ఎత్తున కాలిన నోట్ల కట్టలు దొరకటం తీవ్ర వివాదాస్పదంగా మారటం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. ఆయన్ను బదిలీ చేశారు. అయితే.. తాజాగా ఆయనపై అభిశంసన తీర్మానం పెట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన కీలక పరిణామాలు చకచకా జరుగుతున్నాయి. అన్ని పార్టీలతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సంప్రదింపులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రానున్న వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
ఒకవేళ జస్టిస్ వర్మ తనకు తానుగా స్వచ్ఛందంగా రాజీనామా చేయని పక్షంలో ఈ తీర్మానం సభ ముందుకు వస్తుందని చెబుతున్నారు. వచ్చే నెల (జులై)లో పార్లమెంట్ సమావేశాలు జరగాల్సి ఉంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న యశ్వంత్ వర్మ అధికార నివాసంలో అగ్ని ప్రమాదం సందర్భంగా పెద్ద ఎత్తున నోట్ల కట్టలు వెలుగు చూడటం.. దీనిపై జరిగిన రచ్చతో ఆయన్ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఆయనకు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు అప్పగించొద్దని పేర్కొంది.
ఆపై ముగ్గురు జడ్జిలతో కూడిన విచారణ కమిటీని సుప్రీం నియమించింది. మాజీ సీజేఐ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. తమ విచారణలో భాగంగా జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడటం నిజమేనని నిర్ధారించింది. అంతేకాదు.. ఆయన తీరును తప్పు పడుతూ.. ఆయన చర్యలు అనుచితంగా పేర్కొంది. అంతేకాదు.. కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్న సిఫార్సు చేసింది. అంతేకాదు ఆయన రాజీనామా చేయాలన్న సూచన చేయగా.. జస్టిస్ వర్మ నిరాకరించటంతో తాజా పరిణామాలు తెర మీదకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టాలని భారత రాష్ట్రపతి.. ప్రధానమంత్రికి జస్టిస్ సంజీవ్ ఖన్నా సిఫార్సు చేయటం గమనార్హం.