టిబెట్లోని బ్రహ్మపుత్ర నది ఎగువ ప్రాంతమైన యార్లంగ్ త్సాంగ్పోపై భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టును నిర్మించేందుకు చైనా చర్యలు చేపట్టింది. మొత్తంగా 168 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.14.5 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టును మదర్ ఆఫ్ ఆల్ డ్యామ్స్ అని పిలుస్తున్నారు. ఈ జల విద్యుత్ ప్రాజెక్ట్ వల్ల భారత్కు వాటర్ బాంబ్ ముప్పు పొంచి ఉందనే ఆందోళనల మధ్య.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్లో 11,200 మెగావాట్ల సామర్థ్యం గల అప్పర్ సియాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్తో గట్టి సమాధానం ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టును టిబెట్లోని నైంగ్చీ ప్రాంతంలో.. భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో చైనా నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 60 వేల మెగా వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్దదైన త్రీ గోర్జెజ్ డ్యామ్ కంటే 3 రెట్లు ఎక్కువ అని తెలుస్తోంది. ఇది కేవలం ఒక డ్యామ్ మాత్రమే కాదు.. 5 వరుస జల విద్యుత్ కేంద్రాలు, సొరంగాలు, భూగర్భ పవర్ హౌస్ల నెట్వర్క్తో కూడి ఉంటుంది.
బ్రహ్మపుత్ర నదికి ఎగువన ఉన్న చైనా.. నదిలోని నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేయడం వల్ల.. ఎండాకాలంలో భారత్కు వచ్చే నీరు 85 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందనే భయాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో ఒక వేళ రెండు దేశాల మధ్య యుద్ధం తలెత్తితే ఆ సమయంలో ఒక్కసారిగా ఆ ప్రాజెక్టు నుంచి చైనా నీటిని వదిలితే ఈశాన్య భారతదేశ రాష్ట్రాలు మునిగిపోయే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనినే వాటర్ బాంబ్గా అభివర్ణిస్తున్నారు.
చైనా వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు భారత్ ఎన్హెచ్పీసీ ఆధ్వర్యంలో అరుణాచల్ ప్రదేశ్లో భారీ ప్రాజెక్టును వేగవంతం చేస్తోంది. భారత్ నిర్మించతలపెట్టిన డ్యామ్ సుమారు 9.2 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేయగలదని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో.. ఒకవేళ చైనా ఒక్కసారిగా పై నుంచి వరదను వదిలినా.. ఈ డ్యామ్ ఆ నీటిని అడ్డుకుని దిగువ ప్రాంతాలను కాపాడుతుంది.
బ్రహ్మపుత్ర రివర్ బేసిన్లో సుమారు 208 చిన్న, పెద్ద ప్రాజెక్టుల ద్వారా 75 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి భారత్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుల ద్వారా అరుణాచల్ ప్రదేశ్పై తన పట్టును బలపరుచుకోవడంతో పాటు.. సరిహద్దు వెంబడి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని భారత్ భావిస్తోంది.
అయితే భారత్ చేపడుతున్న ఈ మెగా ప్రాజెక్టుకు స్థానిక తెగలు (ముఖ్యంగా ఆది తెగ ప్రజలు), పర్యావరణవేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు భూమిని కోల్పోవడంతోపాటు.. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందనే భయం ప్రజల్లో నెలకొంది. దీంతో వారు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈనెలలో అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం చౌనా మెయిన్.. ఈ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించి.. స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.


















