హైదరాబాద్ శివారు ప్రాంతంలో మరోసారి రేవ్ పార్టీ కలకలం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం, లింగంపల్లి శివారులోని ఓ ఫాంహౌస్లో బుధవారం అర్ధరాత్రి నిర్వహించిన ఈ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ సంఘటనలో రాజకీయ నాయకులు, రియల్టర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు పాల్గొనడం విశేషం.
కాచిగూడకు చెందిన వ్యాపారి రుద్రశెట్టి సప్తగిరి (49) తన సొంత ఫాంహౌస్లో ఈ పార్టీని ఏర్పాటు చేశాడు. వినోదం కోసం ముంబయి, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్లోని గాజువాక ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది మహిళలను డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం రప్పించారు. బుధవారం సాయంత్రం మొదలైన పార్టీ అర్ధరాత్రి వేళ పూర్తిగా ఊపందుకుంది. ఈ వేడుకకు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి , మాజీ మంత్రి సోదరుడు, మాజీ కార్పొరేటర్ సహా మొత్తం 25 మంది పురుషులు, 8 మంది మహిళలు పాల్గొన్నారు.
ఫాంహౌస్ నుంచి వస్తున్న భారీ శబ్దాలు.. అనుమానాస్పద రాకపోకలపై స్థానికులు మంచాల పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. మద్యం సేవిస్తూ మహిళలతో నృత్యాలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. పార్టీకి ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతో అధికారులు వెంటనే దాడి చేసి అందరినీ అరెస్టు చేశారు.
పోలీసులు దాడిలో రూ.2.45 లక్షల నగదు, 25 మొబైల్ ఫోన్లు, 11 కార్లు, 27 మద్యం సీసాలు.. సౌండ్ సిస్టమ్లను స్వాధీనం చేసుకున్నారు. మహిళా డ్యాన్సర్లకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున చెల్లించినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది.
అరెస్టు చేసిన వారందరినీ మంచాల పోలీస్ స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేశారు. అయితే, వారిని స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు విచారణలో భాగంగా సేకరిస్తున్నారు.
రాజకీయ నాయకులు, ప్రముఖులు పాల్గొన్న ఈ రేవ్ పార్టీ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటువంటి సంఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.