ఇటీవల వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్త అనే కనికరం లేకుండా దారుణంగా హతమార్చుతున్నారు. అలాంటి ఘటనే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను చంపి ఆపై గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయింది. వివరాల్లోకి వెళితే.. చిలువూరుకు చెందిన శివనాగరాజు(45), లక్ష్మీ మాధురికి 2007లో వివాహం జరిగింది. శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేసేవాడు. విజయవాడలోని ఓ సినిమా థియేటర్లో మాధురి కొన్ని రోజులు పనిచేసింది. ఆ సమయంలో సత్తెనపల్లికి చెందిన గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.
హైదరాబాద్లో ట్రావెల్స్ నడిపేవాడు గోపి. శివనాగరాజుకి డ్రైవింగ్ రావడంతో ఉల్లిపాయల వ్యాపారం మానిపించి గోపి వద్ద డ్రైవర్గా ఉద్యోగానికి పంపింది మాధురి. దీంతో కాపురాన్ని హైదరాబాద్కి మార్చారు. ఒకరోజు గోపి, మాధురి ఒంటరిగా గడపడం శివనాగరాజు కంటపడింది. వెంటనే భార్యతో కలిసి తిరిగి చిలువూరికి వెళ్లాడు. గోపితో మాట్లాడొద్దని గట్టిగా హెచ్చరించాడు. కానీ, గోపితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగించింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. శివనాగరాజుది ఉల్లిపాయల వ్యాపారం కావడంతో ఇంటి వద్దే ఉండేవాడు. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన మాధురి తన ప్రియుడు గోపితో కలిసి దారుణమైన ప్లాన్ వేసింది.
జనవరి 18న శివనాగరాజు చేసే భోజనంలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది. గాఢ నిద్రలోకి జారుకున్న భర్తను తన ప్రియుడు గోపితో కలిసి హత్య చేసింది. ప్రియుడు అక్కడ నుంచి వెళ్లిపోయాక, రాత్రి మొత్తం నీలి చిత్రాలు చూస్తూ గడిపింది. ఉదయం ఏమీ తెలియనట్టు తన భర్త గుండెపోటుతో చనిపోయాడని నాటకం మొదలు పెట్టింది. మాధురి వ్యవహారం కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారికి తెలియడంతో అనుమానాలు వచ్చాయి. అలాగే శివనాగరాజు ఒంటిపై గాయాలు కనిపించాయి. దీంతో మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు వెల్లడించింది మాధురి. నిందితుడు గోపి పరారీలో ఉండగా అతని కోసం గాలింపు మొదలు పెట్టారు.
Guntur







