కొన్ని విషయాలు భార్యలకు తెలీకుండా గోప్యంగా ఉంచేసే భర్తలు ఉండటం తెలిసిందే. అలాంటి భర్తకు దిమ్మ తిరిగే షాక్ ఎదురైంది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ కు చెందిన పోతరాజు వీరయ్య అనే రైతు కొన్ని రోజుల క్రితం తన ఎడ్లను అమ్మాడు. దీంతో అతనికి రూ.1.50 లక్షల డబ్బులు వచ్చాయి.
ఆ డబ్బుల్ని ఇంట్లో వారికి చెప్పకుండా ధాన్యం బస్తాలో దాచేశాడు. పని కోసం బయటకు వెళ్లాడు. ఇదిలా ఉండగా.. ఊరికి వాహనంలో వచ్చిన ఒక వ్యాపారి వచ్చి ధాన్యం కొనేందుకు ముందుకు వచ్చాడు. చిల్లర అవసరాల కోసం ఇంట్లో ఉన్న ధాన్యం బస్తాల్లో ఒక బస్తాను సదరు రైతు వీరయ్య భార్య అమ్మేసింది.
బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన వీరయ్య.. తాను డబ్బులు దాచి ఉంచిన ధాన్యం బస్తా లేకపోవటంతో.. ఏమైందని అడగ్గా.. చిల్లర అవసరాల కోసం బస్తా ధాన్యాన్ని అమ్మేసినట్లుగా చెప్పింది. దీంతో. అసలు విషయం తెలిసిన భార్య షాక్ తిన్నది. వాహనంలో ధాన్యం కొనుగోలు చేసి వెళ్లిన వ్యాపారి కోసం చుట్టు పక్కల ప్రాంతాల్లో వాకబు చేయగా.. అతడి ఆచూకీ లభించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ వ్యాపారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు