• ముఖ్యమంత్రి రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం పోలవరం పనులు.
• 500 మీటర్లు పూర్తైన గ్యాప్-2 డయాఫ్రం వాల్ నిర్మాణం.
• మూడు ట్రెంచ్ కట్టర్లు, గ్రాబర్లతో పనులు.
• 2025 డిసెంబర్ కి పూర్తి చేసేలా జరుగుతొన్న పనులు.
గత ప్రభుత్వం ముంచేసిన పోలవరం ప్రాజెక్టు పనులను గాడిలో పెట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ విడుదల చేశారని, ఆయన విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రాజెక్టు పనుల్లో కీలకమైన గ్యాప్-2 డయా ఫ్రంవాల్ ను 1396 మీటర్ల పొడవున నిర్మించాల్సి ఉండగా మంగళవారం నాటికి 500 మీటర్ల పొడవున నిర్మాణ పనులు పూర్తి చేశామని స్పష్టం చేశారు.
మూడు ట్రెంచ్ కట్టర్లు, మూడు గ్రాబర్లతో గ్యాప్-2 డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసేలా, అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. వరదల సమయంలో సైతం డివాటరింగ్ చేస్తూ శరవేగంగా పనులు జరుగుతున్నాయని, ఎగువ కాఫర్ డ్యాంను బలోపేతం చేసేలా నిర్మిస్తున్న బట్రస్ డ్యాం నిర్మాణ పనులు సైతం 90శాతంకు పైగా పూర్తయ్యాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాన్ని చక్క దిద్దామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చేలా చురుకుగా పనులు జరుగుతున్నాయని తెలిపారు.