విజయవాడలో సంచలనం: పోలీసుల హెచ్చరికలు పట్టించుకోకుండా రూ.49 లక్షలు కోల్పోయిన రిటైర్డ్ ఉద్యోగి – డిజిటల్ మోసం ఎలా జరిగింది?
విజయవాడ: సైబర్ నేరగాళ్ల మాయలో మళ్లీ పడిన ఓ రిటైర్డ్ ఉద్యోగి ఘటన నగరంలో కలకలం రేపుతోంది. గత నెలలోనే డిజిటల్ మోసం నుంచి పోలీసులు రక్షించినా, చిలుకకు చెప్పినట్లు చెప్పినా వినకుండా మళ్లీ అదే మోసగాళ్ల మాటలు నమ్మి రూ.49 లక్షలు కోల్పోయిన వైనం బాధాకరం. సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ గ్యాంగులు ఎంత పద్ధతిగా మోసం చేస్తున్నాయో ఈ సంఘటన మరోసారి స్పష్టం చేసింది.
విజయవాడలో స్థిరపడిన స్టీల్ ప్లాంట్కు చెందిన 65 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి(Retired Employee) గత నెలాఖరులో “ఈడీ నుంచి ఫోన్ చేస్తున్నాం” అంటూ కాల్ వచ్చింది. మీపై మనీలాండరింగ్ కేసులు ఉన్నాయని, వెంటనే విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేస్తామని బెదిరించారు. మరింత నమ్మకం కలిగించేందుకు యూనిఫాంలో వీడియో కాల్ చేసి, తాను దర్యాప్తు అధికారినని చెప్పిన వ్యక్తి, రూ.72.50 లక్షలు చెల్లిస్తే కేసు మాఫీ చేస్తానని మాటిచ్చాడు.
భయంతో దిగ్బ్రాంతికి గురైన ఆ ఉద్యోగి, విజయవాడ రామచంద్రనగర్లోని ఎస్బీఐ బ్రాంచ్కు వెళ్లి తన పేరిట ఉన్న రూ.78 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను రద్దు చేయించాడు. అందులో రూ.72.50 లక్షలను మోసగాళ్లు సూచించిన ఖాతాకు బదిలీ చేయాలని కోరాడు. అయితే అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఖాతా నంబర్ పరిశీలించగా అది కోల్కతాకు చెందినదని తేలింది. వెంటనే లావాదేవీ నిలిపివేసి, ఆ ఉద్యోగికి సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. ఇలాంటి కాల్స్ నమ్మొద్దని, మళ్లీ ఫోన్ వస్తే వెంటనే పోలీసులకు(Police Warning) చెప్పాలని హెచ్చరించారు.
అయితే 15 రోజుల తర్వాత మళ్లీ అదే తరహా ఫోన్ కాల్ వచ్చింది. ఈసారి మోసగాళ్లు మరింత నమ్మకం కలిగించేలా మాట్లాడి, “మీ కేసు ఇంకా పెండింగ్లో ఉంది, వెంటనే చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది” అంటూ భయపెట్టారు. ఆ ఉద్యోగి మళ్లీ బ్యాంకుకు వెళ్లి తాము బెంగళూరుకు మారిపోతున్నామని చెప్పి, మొత్తం డబ్బును తన పొదుపు ఖాతాలోకి బదిలీ చేయించాడు. అనంతరం ఇండియన్ బ్యాంకులో కొత్త ఖాతా తెరిచి, దశలవారీగా రూ.49 లక్షలు మోసగాళ్ల ఖాతాకు బదిలీ చేశాడు.
బ్యాంకు సిబ్బంది అనుమానం వ్యక్తం చేసి పలుమార్లు ప్రశ్నించినా, తెలిసిన వ్యక్తికే పంపిస్తున్నానని చెప్పి వారిని నమ్మబలికాడు. నాలుగు రోజుల తర్వాత మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డబ్బు బదిలీ అయిన ఖాతాల వివరాలు సేకరించి, సైబర్ క్రైమ్ విభాగంతో కలిసి ట్రేస్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ ఘటన సీనియర్ సిటిజన్లు ఎంత జాగ్రత్తగా ఉండాలో గుర్తు చేస్తోంది. సైబర్ నేరగాళ్లు(Cyber Crime) ఇప్పుడు పోలీసు అధికారులు, ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను శాఖ పేర్లు చెప్పి ప్రజలను బెదిరిస్తున్నారు. యూనిఫాం ధరించి వీడియో కాల్ చేయడం, నకిలీ ఐడీ కార్డులు చూపించడం, అధికారిక లేఖల మాదిరి పత్రాలు పంపడం వంటి పద్ధతులు అవలంబిస్తున్నారు. భయపెట్టి వెంటనే డబ్బు ట్రాన్స్ఫర్ చేయించడమే వారి ప్రధాన లక్ష్యం.
పోలీసుల సూచనలు:
-
ఎవరైనా అధికారిగా చెప్పి డబ్బు అడిగితే వెంటనే అనుమానించాలి.
-
వీడియో కాల్లో యూనిఫాం చూపించినా నమ్మకూడదు.
-
తెలియని ఖాతాలకు డబ్బు బదిలీ చేయరాదు.
-
వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలి.
-
సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలి.
సమాజంలో అవగాహన పెంచితేనే ఇలాంటి మోసాలను అరికట్టవచ్చు. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వృద్ధులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించడం అత్యవసరం. ఒక్కసారి కాదు, పదిసార్లు ఆలోచించి మాత్రమే ఆన్లైన్ లావాదేవీలు చేయాలి. చిన్న నిర్లక్ష్యం లక్షల్లో నష్టాన్ని మిగుల్చుతుంది.
CyberCrime









