హైదరాబాద్ చార్మినార్ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. చార్మినార్కు సమీపంలోని గుల్జార్ హౌస్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 17 మంది మృతిచెందారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, యశోద డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించారు. కొందరు ఘటనాస్థలంలో.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు.
షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. 10 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఈ సంఘటన ఉదయం 6 గంటలకు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటివరకు మంటలు అదుపులోకి రాలేదు. సుమారు 10 గంటల నుండి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు నేడు మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ప్రపంచ సుందరీమణులు ఇవాళ సాయంత్రం సెక్రటేరియట్ ను సందర్శించనున్నారు. దీంతో సెక్రటేరియట్ వద్ద అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ట్యాంక్ బండ్ మీద సండే-ఫండే ఈవెంట్ కు అంతా సిద్ధం చేశారు. ఇక మిస్ వరల్డ్ లకు సంబంధించి డ్రోన్ షో సైతం ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 3గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ట్యాంకుబండ్ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు.
క్రమంలోనే భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వాణిజ్య భవనంగా ఉండటంతో అక్కడ భారీగా స్టాక్ చేసిన వస్తువులు మంటలకు ఆహుతయ్యే అవకాశం ఉంది. మంటల్లో చిక్కుకున్న వారిని బయటికి తెచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. అంతస్తుల మధ్య చేరలేని స్థితిలో చిక్కుకున్నవారిని క్రేన్లు, ల్యాడర్లు, హైడ్రాలిక్ ఎక్విప్మెంట్లతో రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.