దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక భారీ సైబర్ మోసం ఉదంతాన్ని పుదుచ్చేరి సైబర్ క్రైమ్ పోలీసులు బట్టబయలు చేశారు. ఏకంగా ఒక ఇంజినీరింగ్ కాలేజీ క్యాంపస్ నుంచే ఈ నేర నెట్వర్క్ నడుస్తోందని తేలడంతో పోలీసులు ఆ కాలేజీని “సైబర్ క్రైమ్ హాట్స్పాట్”గా అభివర్ణించారు. ఈ దర్యాప్తులో సుమారు ₹90 కోట్ల విలువైన లావాదేవీల మోసం జరిగినట్టు ప్రాథమికంగా బయటపడింది.
అసలు కథ దీనేష్, జయప్రతాప్ అనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల బ్యాంకు ఖాతాలు అనుమానాస్పద లావాదేవీల కారణంగా ఫ్రీజ్ అయినప్పుడు వెలుగులోకి వచ్చింది. వారిని విచారించగా తమ ఖాతా వివరాలను స్నేహితుడు హరీష్ కు ఇచ్చినట్టు తెలిపారు. ఈ ఒక్క లింక్ ద్వారా పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా, వెలుగు చూసిన విషయాలు దిగ్భ్రాంతికి గురి చేశాయి. ప్రధాన నిందితుడు హరీష్, ఇతరులు కలిసి దాదాపు 20కి పైగా బ్యాంకు ఖాతాలను సేకరించారు. వీటిలో ఎక్కువ శాతం ఇంజినీరింగ్ విద్యార్థులవే కావడం గమనార్హం. ఈ ఖాతాలనే సైబర్ నేరగాళ్లు మోసం ద్వారా సంపాదించిన డబ్బును ఒకచోటు నుంచి మరోచోటుకు తరలించడానికి ‘మ్యూల్ అకౌంట్స్’ గా వినియోగించారు. ఇప్పటివరకు క్రైమ్ నెట్వర్క్ ద్వారా తరలిపోయిన మొత్తం విలువ ₹90 కోట్లుగా అంచనా వేయగా, ఇందులో ₹7 కోట్లకు పైగా నగదు ప్రవాహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ భారీ మొత్తాన్ని దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సేకరించి, చివరకు దుబాయ్ , చైనాలోని అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ల ద్వారా క్రిప్టోకరెన్సీగా మార్చినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. ఇందులో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు/గ్రాడ్యుయేట్స్ కావడం యువత భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అరెస్టు చేసిన వారిలో థామస్ అలియాస్ హయగ్రీవ, హరీష్, గణేశన్, గోవిందరాజ్, యష్విన్, రాహుల్, అయ్యప్పన్ లుగా పోలీసులు నిర్ధారించారు. చైనా మాఫియాతో కీలక సంధానకర్త గణేశన్. నిందితుల్లో ఒకడైన గణేశన్, విదేశీ సైబర్ క్రిమినల్స్తో నేరుగా టెలిగ్రామ్ ద్వారా సంప్రదింపులు జరిపి, నగదును చైనా మాఫియాకు పంపేందుకు కీలకపాత్ర పోషించినట్టు పోలీసులు తెలిపారు. ప్రతి లావాదేవీపై ఇతను కమిషన్ తీసుకున్నట్టు వెల్లడైంది.
ఈ నేరానికి సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ₹5 లక్షల నగదు, 171 చెక్బుక్స్, 75 ATM కార్డులు, 20 మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, అనేక బ్యాంకు పాస్బుక్స్, క్రెడిట్ కార్డులు, హ్యుందాయ్ వెర్నా కారును స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు నేపథ్యంలో పుదుచ్చేరి పోలీసులు సాధారణ ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు, కొన్ని ముఖ్యమైన హెచ్చరికలు జారీ చేశారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నేరంలో నిందితుడిని చేయగలదు అని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మీ బ్యాంకు ఖాతా వివరాలు , ఏటీఎం, పాస్వర్డ్ లేదా యూపీఐ పిన్ వివరాలను అపరిచితులతో పంచుకోవద్దు. డబ్బు, కమిషన్ ఆశ చూపినా లేదా స్నేహం పేరు చెప్పినా ఎవరినీ మీ బ్యాంకు ఖాతాను ఉపయోగించుకునేలా అనుమతించొద్దు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచన లేదా షార్ట్కట్ మీ భవిష్యత్తును పూర్తిగా నాశనం చేయగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ కేసు, ఆధునిక కాలంలో క్యాంపస్ నుంచి అంతర్జాతీయ మాఫియా చేతికి యువత ఎలా పావుగా మారుతోందో, ఎంత పెద్ద మొత్తంలో ధనశోధన జరుగుతోందో స్పష్టం చేస్తోంది.
పుదుచ్చేరి సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల 90 కోట్ల రూపాయల భారీ సైబర్ మోసం (cyber frauds) యొక్క నెట్వర్క్ను ఛేదించారు. ఈ కేసులో ఇంజినీరింగ్ విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.
ప్రధాన వివరాలు:
మోసం తీరు: సైబర్ నేరగాళ్లు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల నుండి వారి స్నేహితులు మరియు సహవిద్యార్థుల బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించారు.
మనీ లాండరింగ్: సేకరించిన ఈ ఖాతాలను “మ్యూల్ అకౌంట్స్” (mule account) గా ఉపయోగించి, మోసం ద్వారా సంపాదించిన డబ్బును ఈ ఖాతాల ద్వారా బదిలీ చేశారు. భారతదేశం ద్వారా డబ్బును తరలించిన తర్వాత దుబాయ్ మరియు చైనాలోని నెట్వర్క్ల ద్వారా క్రిప్టోకరెన్సీ (cryptocurrency) గా మార్చారు.
అరెస్టులు: ఇప్పటివరకు నలుగురు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు సహా మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు: పోలీసులు రూ. 5 లక్షల నగదు, 171 చెక్ బుక్లు, 75 ఏటీఎం కార్డులు, 20 మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు మరియు ఇతర సంబంధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తు: ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు తమ ఖాతాలు ఫ్రీజ్ కావడంతో పోలీసులను ఆశ్రయించగా ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
సైబర్ నేరాల నుండి రక్షించుకోవడానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మీరు సైబర్ మోసానికి గురైనట్లయితే, వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో ఫిర్యాదు చేయవచ్చు.


















