ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 6న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. దాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత కాట్రా-శ్రీనగర్ వందే భారత్ సర్వీస్ను ప్రారంభిస్తారు.
ఉధంపుర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ బ్రిడ్జిని నిర్మించారు.చీనాబ్ బ్రిడ్జి కశ్మీర్లో పర్యాటకానికి ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ బ్రిడ్జిని నది సాధారణ నీటిమట్టానికి 359 మీటర్ల ఎత్తులో నిర్మించారు. జమ్మూకశ్మీర్, రియాసి జిల్లాలోని బక్కల్, కౌరి గ్రామాలను ఈ బ్రిడ్జి అనుసంధానిస్తుంది.భూకంపాలతో పాటు వరదల వంటి వాటిని తట్టుకుని సైతం నిలబడేలా దీన్ని నిర్మించారు.
పారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ కంటే ఈ బ్రిడ్జి 35 మీటర్ల ఎత్తు ఎక్కువగా ఉంటుంది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి 2.86 కోట్ల కిలోల స్టీల్ను వాడారు.మైనస్ 10 డిగ్రీల నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లోనూ ఈ బ్రిడ్జిని ఉపయోగించుకోవచ్చు. ఈ బ్రిడ్జి మొత్తం 1.31 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇందుకుగానూ కేంద్ర సర్కారు రూ.1,486 కోట్లు ఖర్చు చేసింది.జమ్మూకశ్మీర్ను రైల్వే నెట్వర్క్తో అనుసంధానించాలన్నది వందేళ్ల క్రితం నుంచి ఉన్న కల.
మన దేశాన్ని బ్రిటిషర్లు పరిపాలిస్తున్న కాలంలోనే దీనికి పునాది వేసినప్పటికి ఇప్పటివరకు ఆ కల నెరవేరలేదు. 1905లో బ్రిటిషర్లు ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను పరిశీలించగా, రైల్వే లైన్ నిర్మాణానికి నాటి మహారాజా ప్రతాప్ సింగ్ కూడా ఒప్పుకున్నారు.అయినప్పటికీ పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలాసార్లు ఈ రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. ఆ కల ఇప్పుడు నెరవేరుతోంది. ఈ బ్రిడ్జి ద్వారా రైల్వే నెట్వర్క్తో జమ్మూకశ్మీర్ లింక్ అవుతుంది. త్వరలోనే కాత్రా, శ్రీనగర్ వందే భారత్ రైలు పరుగులు తీయనుంది.