భార్యా భర్తల అనుబంధం, విలువలపై చాలా టీవీ సీరియళ్లు, సినిమాలు వచ్చాయి. కానీ సినిమా వేరు.. జీవితం వేరు. ఎప్పుడు ఏ బంధం ఎలా వీగిపోతోందో చెప్పలేని పరిస్థితి. అంతా బాగానే ఉంది అనుకుంటుండగానే న్యూస్ హెడ్ లైన్స్ లోకొచ్చి షాకిస్తున్నారు కొందరు సెలబ్రిటీలు. ఇటీవలి కాలంలో ఏడాదికి అరడజను పైగానే హై ప్రొఫైల్ విడాకుల గురించి వినాల్సి వస్తోంది.
భారతదేశంలో ఇప్పటివరకూ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ – సుస్సేన్ ఖాన్ జంట విడాకులు అత్యంత ఖరీదైన వ్యవహారంగా చర్చల్లోకొచ్చింది. హృతిక్ రోషన్-సుసానే ఖాన్ జంట 2014లో విడిపోయారు. ఇద్దరు కిడ్స్ కూడా ఉన్నారు. 15ఏళ్ల బంధం వీగిపోవడం అభిమానుల హృదయాలను కలచివేసింది. సుస్సానే తన భర్త హృతిక్ నుంచి భరణంగా రూ. 400 కోట్లు డిమాండ్ చేసిందని, 380 కోట్లు చెల్లించారని ప్రచారమైంది. కానీ ఇవన్నీ అవాస్తవాలు అంటూ వారి లాయర్లు కొట్టి పారేసారు.
మరో స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్- నటి అమృతా సింగ్ జంట 13ఏళ్ల దాంపత్య జీవనం తర్వాత విడిపోయారు. సైఫ్ భారీ మొత్తంలో మొదటి భార్యకు చెల్లించుకున్నారని కథనాలొచ్చాయి. సైఫ్ తన భార్యకు రూ.5 కోట్లు భరణం ఇవ్వాలని వారసుడు ఇబ్రహీంకు 18 ఏళ్లు వచ్చే వరకు నెలకు 1 లక్ష ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు తీర్పు వెలువరించినట్టు కథనాలొచ్చాయి. సంజయ్ కపూర్-కరిష్మా కపూర్ విడాకులు కూడా కాస్ట్ లీ ఎఫైర్ గానే ముగిసింది. ఈ జంట ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు. ఇద్దరూ తమ 13 సంవత్సరాల వివాహ బంధాన్ని ముగించారు. సంజయ్ తండ్రి నివాసం(ఇల్లు)పై హక్కులను యాజమాన్యాన్ని కరిష్మా తన పేరుకు బదిలీ చేయించుకుంది. ఆమె బాండ్ల నుండి నెలవారీ రూ. 10 లక్షల వడ్డీని కూడా అందుకుంటోంది. తన పిల్లల పేర్ల మీద 14 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి.
మలైకా అరోరా – అర్బాజ్ ఖాన్ బ్రేకప్ ఖరీదైనదే. ఈ జంట 13 సంవత్సరాల వైవాహిక జీవితం అనంతరం విడిపోయారు. మలైకా రూ.10 కోట్ల నుంచి 15 కోట్ల మేర భరణం తీసుకుందని సమాచారం. నటుడు దర్శకనిర్మాత ఫర్హాన్ అక్తర్- అధునా భబానీ 16 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. 2016 లో ఈ జంట విడిపోయారు. ఫర్హాన్ నెలవారీ భత్యానికి బదులుగా వన్-టైమ్ భరణం మొత్తాన్ని చెల్లించాడు. అధునా 10000 చదరపు అడుగుల భవనం `విపాసన`ను కూడా దక్కించుకుంది. ఫర్హాన్ నటి శిభాని దండేకర్ ని రెండో వివాహం చేసుకున్నారు. అమీర్ ఖాన్- కిరణ్ రావు దంపతులు విడిపోయారు. కిరణ్ దాదాపు రూ. 50 కోట్లు భరణంగా పొందే అవకాశం ఉందని కథనాలొచ్చాయి. కానీ వివరాలేవీ బయటకు రాలేదు.