ఏపీలోని కడప జిల్లాలో ఇవాళ నిర్వహిస్తున్న టీడీపీ పసుపు పండుగ మహానాడులో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను చంద్రబాబు వివరించారు. వీటి వల్ల రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి లబ్ది జరగబోతోందో కూడా ఆయన వెల్లడించారు. హెల్తీ(ఆరోగ్య), వెల్తీ(ఆర్ధిక), హ్యాపీ (సంతోష) ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమన్నారు.
ఇందులో భాగంగా ప్రతీ ఒక్కరి ఆదాయం 55 లక్షలు ఉండేలా ఓ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. క్లీన్, విజన్, పాజిటివ్ పాలిటిక్స్ తమ విధానం అన్నారు. రాష్ట్రం ఫస్ట్ అనేది తమ సిద్దాంతమన్నారు. ప్రతిపక్షంలో ఉండగా అవినీతి వ్యతిరేకంగా పోరాడామని, అధికారంలో ఉంటే అవినీతి రహిత పాలన అందించామని గుర్తుచేశారు.
ప్రజల ఆస్తులు, హక్కుల పరిరక్షణకు కట్టుబడి పని చేశామని, ఇకపైనా చేస్తామన్నారు. విజన్ తో భావితరాల భవిష్యత్ కు అవసరమైన పాలసీలు తెచ్చామని,పాజిటివ్ పాలిటిక్స్ తో రాజకీయాల్లో విలువలు పెంచామని చంద్రబాబు తెలిపారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీలో చూసినా తెలుగుదేశం యూనివర్సిటీ విద్యార్థులే నాయకులుగా ఉన్నారన్నారు. మనది MOST SUCCESS MODEL పాలనా విధానం అని గత చరిత్ర చెపుతోందన్నారు.ఈ చరిత్ర చింపేస్తే చిరిగేది కాదు..చెరిపేస్తే చెరిగేది కాదు. ప్రజల గుండెల్లో దృఢమైన ముద్ర మనం అన్నారు.
ఈ ప్రయాణం మరింత గొప్పగా సాగాలని,ప్రస్తుత టెక్నాలజీ యుగంలో, ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ విధానాల్లో నూతనత్వాన్ని తీసుకువద్దామని చంద్రబాబు సూచించారు. ఆ దిశగా కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడులో చర్చించి నిర్ణయాలు తీసుకుందామన్నారు. మరో 40 ఏళ్లు పార్టీ బలంగా నిలబడడానికి అవసరమైన ప్రణాళికను రూపొందిద్దామన్నారు. దీనిపై ఇప్పటికే లోకేష్ కొన్ని ఆలోచనలు చేస్తున్నారని,వాటికి ఈ మహానాడులో తుదిరూపు ఇద్దామని తెలిపారు.