తాను అథ్లెట్ కాకపోయినప్పటికీ, ఒక హెల్త్కేర్ నిపుణురాలిగా శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంత కీలకమో తనకు బాగా తెలుసని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అర్ధాంగి, ప్రముఖ వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల అన్నారు. క్రీడల ద్వారా దేశాన్ని ఆరోగ్యవంతంగా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత త్వరలోనే నిజమవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రామ్ చరణ్, ఉపాసన నిన్న ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన సంగతి తెలిసిందే.
విజయవంతంగా ముగిసిన తొలి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సందర్భంగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ టోర్నమెంట్ను ఉపాసన తండ్రి, ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ కామినేని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ లీగ్ విజయవంతం కావడం పట్ల ఆమె తన తండ్రికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఇదే సమయంలో, ఆర్చరీ క్రీడకు తన భర్త, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అత్యుత్తమ బ్రాండ్ అంబాసిడర్ అని ఉపాసన కొనియాడారు. ఆయన ప్రచారంతో ఈ క్రీడను మరింత మంది ప్రజలు స్వీకరించి, తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తాను మద్దతు తెలిపేందుకే హాజరయ్యానని, తన అత్తమామలు చిరంజీవి, సురేఖల తరఫున ప్రధాని మోదీకి బాలాజీ విగ్రహాన్ని బహూకరించినట్లు ఆమె వెల్లడించారు. .