*జూలై 10న హంద్రీనీవా నీరు విడుదల*
*పనుల పూర్తికి రూ. 3,873 కోట్లు ఖర్చు చేస్తున్నాం*
*ప్రాజెక్టు పూర్తయితే ఫేజ్ 1లో 1,98,000 ఎకరాలకు, ఫేజ్ 2లో 4,04,500 ఎకరాలకు సాగునీరు*
*గత పాలకుల నిర్లక్ష్యంతో హంద్రీనీవా ప్రశ్నార్థకం-కూటమి ప్రభుత్వం వచ్చాక శరవేగంగా పనులు*
*-సీఎం చంద్రబాబు నాయుడు*
*ఉరవకొండ నియోజకవర్గం చాయాపురంలో హంద్రీనీవా సుజల స్రవంతి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఎం*
*దేశ రక్షణలో అసువులు బాసిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించిన సీఎం చంద్రబాబు*
*ఉరవకొండ, మే 9:* జూలై 10న హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ఫేజ్ – 1, 2 కింద 554 కి.మీ. మేర కాలువ లైనింగ్, వెడల్పు పనులకు రూ.3,873 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఐదేళ్లు హంద్రీనీవా పనులు ఆగిపోయాయని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులను శరవేగంగా పూర్తి చేస్తోందని అన్నారు. పోలవరం-బనకచర్ల పూర్తయితే సీమలో కరువు అనే మాట వినబడదని, రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందుతుందని అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం చాయాపురంలో హంద్రీనీవా సుజల స్రవంతి పనులను క్షేత్రస్థాయిలో సీఎం పరిశీలించారు. అనంతరం చాయాపురంలో నిర్వహించిన ప్రజావేదికలో పాల్గొన్నారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం చంద్రబాబు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు.
*సీమను రతనాలసీమ చేస్తానని ఆరోజే చెప్పా*
1996, మార్చి 11వ తేదీన నేను ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రినీవాకు శంకుస్థాపన చేశాను. మనందరి ప్రియతమ నేత ఎన్టీఆర్ కల హంద్రినీవా. ఆనాడు రాయలసీమకు నీరు లేదు. ఎడారిగా మారిపోతుందని అందరూ చేతులెత్తేశారు. అలాంటి పరిస్థితుల్లో నమ్మకం కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆనాడు కృష్ణా జలాలను బచావత్ అవార్డు ప్రకారం కేటాయించేవారు. మిగులు జలాలు వాడుకునే అవకాశం ఏపీకి ఉందని భావించిన ఎన్టీఆర్ హంద్రినీవా, గాలేరు, నగరి, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులు తెచ్చి సీమ దశదిశా మార్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయ్యాక సీమకు ఏం చేయాలో అన్నీ చేశాను. ఈ జిల్లాకు నేను ఎప్పుడు వచ్చినా ప్రత్యేకంగా ఈల సౌండ్ వస్తుంది. ప్రజలు పరుగెత్తుకొచ్చి జిందాబాద్ కొడతారు. ఈ జిల్లా రూపురేఖలు మార్చాలని నిర్ణయించాను. ఒకప్పుడు ఇక్కడ వేరుశెనగ పంటే వేసేవారు. పదేళ్లలో రెండేళ్లు మాత్రమే పంట వచ్చేది. నాయకులు నా దృష్టికి తెస్తే రైతులకు నష్ట పరిహారం ఇచ్చాం. నాకింకా గుర్తుంది. ఒకసారి కరువు వచ్చి మనుషులకు, పశువులకు నీరు లేదు. పశువుల కోసం చెరువుల దగ్గర క్యాంపులు పెట్టాం. కోస్తా నుంచి గడ్డి తెచ్చి పశువులను కాపాడాం. రాయలసీమ రాళ్ల సీమ అని చాలామంది అన్నారు. రతనాలసీమ చేస్తానని ఆరోజు చెప్పాను. మొన్నటి ఎన్నికల్లో కూటమికి జిల్లా వాసులు పట్టం కట్టారు.
*చెప్పిన గంటలోనే జీవో ఇచ్చా*
నీరు ఉంటేనే ఏదైనా సాధ్యం . నీటి వనరుల కోసం హంద్రినీవాను వెడల్పు చేస్తానని చెప్పిన గంటలో జీవో ఇచ్చాను. అదే సమయంలో 37 శాతం పనులు పూర్తి చేశాను. 2014లో మేం గెలిచాక సీమ ప్రాజెకక్టులపై దృష్టి పెట్టాం. కియా పరిశ్రమను ఏపీకి రమ్మంటే నీళ్లు ఎక్కడున్నాయో చెప్పమన్నారు. ఆరు నెలల సమయం తీసుకుని గొల్లపల్లి ప్రాజెక్టు పూర్తిచేసి ఐదేళ్లలోనే కరువు జిల్లాకు కియా వచ్చేలా చేశాం. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా, ఒక్క రోడ్డుకైనా మట్టి వేశారా, గుంటలు పూడ్చారా, కాల్వల్లో గంప మట్టి తీశారా … అలాంటి ప్రభుత్వాల వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు.
*మీలో ఆనందానికి హంద్రినీవానే కారణం*
2014-19 మధ్యకాలంలో ఇక్కడ ఇరిగేషన్ కోసమే రూ. 70 వేల కోట్లు ఖర్చు చేశాం. ఒక్క రాయలసీమలోనే రూ. 12, 441 కోట్లు ఖర్చు చేశాం. హంద్రినీవాలో రూ. 4,200 కోట్లు ఖర్చు చేశాం. 10 మీటర్ల నుంచి 16. 5 మీటర్ల వెడల్పు చేశాం. 40 టీఎంసీ నీరు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సీజన్ లోనే పనులు పూర్తి చేస్తాం. 23 నుంచి 34 ప్యాకేజీలు పనులు పూర్తయ్యాయి. గొల్లపల్లి, మడకశిర బ్రాంచ్ కెనాల్ పూర్తిచేశాం. చెర్లోపల్లి , జీడిపల్లి ప్రాజాక్టులు పూర్తిచేశాం. హంద్రీనీవా ప్రాజెక్టు కోసం 512 ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. మొత్తంగా 1040 మిషన్లు పనిచేస్తున్నాయి. మొన్నటి వరకూ పుట్టపర్తి చుట్టుపక్కల నీరు కనిపించేది కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా నీరు కనిపిస్తుంటే ఆనందంగా ఉంది. ఒకప్పుడు ఇక్కడి జనం దిగాలుగా ఉండేవారు. ఇప్పడు హషారుగా ఉన్నారు. నీరు అందడంతోనే మీలో ధైర్యం వచ్చింది. అందుకు హంద్రినీవానే కారణం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కుప్పం వరకూ హంద్రినీవా 770 కిలోమీటర్లు పొడవుంది. ఇది ఆసియాలోనే పొడవైనది.
*ప్రాజెక్టు పూర్తయితే ప్రతి ఎకరాకు సాగునీరు*
ప్రాజెక్టు పూర్తయితే ఫేజ్-1 కింద కర్నూలు జిల్లాలో 77,094, నంద్యాల జిల్లాలో 2,906, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాలు… మొత్తం 1,98,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఫేజ్-2 కింద అనంతపురం జిల్లాలో 33,617, సత్యసాయి జిల్లాలో 1,93,383, కడప జిల్లాలో 37,500, చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలు కలిపి మొత్తం 4,04,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ నీటితో హార్టికల్చర్ పంటలు వేసుకుంటే రైతాంగం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇజ్రాయిల్ దేశంలో అప్పట్లోనే మైక్రో ఇరిగేషన్ తో పంటలు పండించేవారు. ఈ విధానానికి దేశంలో మనమే మొదటిగా శ్రీకారం చుట్టాం. గత ఐదేళ్లలో డ్రిప్ , మైక్రో ఇరిగేషన్ పథకాలు ఇవ్వలేదు. దేశంలోనే 90 శాతం డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఇచ్చేది ఏపీ ప్రభుత్వమే . పోలవరం-బనకచర్ల పూర్తయితే రాష్ట్ర ముఖచిత్రం మారిపోతుంది. 2 వేల టీఎంసీల నీరు గోదావరి నుంచి సముద్రంలోకి పోతోంది. అందులో 300 టీఎంసీ నీరు మనం తెచ్చుకోగలిగితే రాష్ట్రమంతా సస్యశ్యామలం అవుతుంది. ప్రతి ఎకరాకు నీరు అందుతుంది. రైతులు బంగారం పడిస్తారు. ప్రాజెక్టు కోసం రూ. 81 వేల కోట్లు కావాలి. సంకల్పం ఉంటే అదే దారి చూపుతుంది. పోలవరం నుంచి బనకచర్ల వరకూ నీరు తెస్తే నా జీవితం సార్ధకమవుతుంది.
*దేశాన్ని రక్షించే సమర్థ నాయకుడు మోదీ*
దేశాన్ని రక్షించే శక్తి ప్రధాని మోదీకి ఉందని ఇటీవల అమరావతి సభలో నేను చెప్పాను. మనదేశం టెర్రరిజానికి వ్యతిరేకం. పహల్గామ్ ఘటనలో ఆడబిడ్డలు, పిల్లల ముందు మగవారిని కిరాతకంగా పొట్టనపెట్టుకున్నారు . తీవ్రవాదానికి ప్రపంచంలో చోటు లేదని ప్రధాని మోదీ చెప్పారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ తో టెర్రరిస్టులను హతం చేసింది. పాకిస్తాన్ మనపై దాడులు చేస్తూ కవ్వింపు చర్యలకు దిగుతోంది. దేశ రక్షణలో భాగంగా మన తెలుగుబిడ్డ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధించింది. అతని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటాం. ఎందరో యువకులు రక్షణశాఖలో చేరుతున్నారు. సైన్యానికి మనమంతా అండగా ఉండాలి. వారి పోరాటానికి మద్దతివ్వాలి. ప్రపంచంలో హింసకు తావులేదు. ప్రగతిలో పోటీ పడాలి. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలి కానీ సమస్యలు సృష్టించడం సరికాదు.
*రాష్ట్రమంతటా సంక్షేమ ఫలాలు*
రాష్ట్రంలోని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. 63 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నాం. ఇందుకోసం రూ. 33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రతి కుటుంబానికి ఇల్లు, మంచినీటి కుళాయి , మరుగుదొడ్లు, కరెంటు, దీపం కింద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్నదే నా లక్ష్యం. ఇప్పటికే 200కు పైగా అన్నాక్యాంటీన్లు ఏర్పాటు చేశాం. దీపం 2 పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మత్స్యకారులకు రూ. 20 వేలు వేశాం. 16 వేలకు పైగా టీచరు పోస్టులు భర్తీ చేయబోతున్నాం. రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదిలో మూడు విడతల్లో రూ. 20 వేలు పెట్టుబడి సాయం అందిస్తాం. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ రూ. 15 వేలు అందిస్తాం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం. భద్రత విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఆడబిడ్డల జోలికొస్తే నేరస్థుల పనిపడతాం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. త్వరలో హెల్త్ డిజిటల్ కార్డులు అందుబాటులోకి తెస్తాం. గుంతల రోడ్లు గత పాలకుల ఎలా పాలించారో చెప్పాయి. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే రాష్ట్రమంతటా గుంటలు పూడ్చాం.
*ఉరవకొండలో అభివృద్ధి పరుగులు*
ఉరవకొండకు టెక్స్ టైల్ పార్క్ మజూరు చేస్తున్నాం. గొట్టిపాడు దగ్గర బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తాం. కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేస్తున్నాం. జీడిపల్లి నిర్వాసితులకు వెంటనే పరిహారం అందిస్తాం. 40 వేల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పునరుద్ధరిస్తాం. రామసాగరం బ్రిడ్స్ ,జీడిపల్లి, భైరవారి తిప్ప , పేరూరు సహా అన్నింటికి ప్రాధాన్యత ఇచ్చి పూర్తిచేస్తాం. చాయాపురం గ్రామాభివృద్ధికి ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తాం.
*పీ4తో పేదరిక నిర్మూలనకు శ్రీకారం*
అభివృద్ధి వికేంద్రీకరణ గురించి ఆలోచిస్తున్నాను. పేదరికం నుంచి అందరినీ పైకి తేవాలి. నేను అవకాశాలను ఉపయోగించుకుని అంచెలంచెలుగా ఎదిగాను. ఎన్టీఆర్, మోదీ, అంబేద్కర్, కలామ్, గాంధీజీ లాంటి వారు కూడా ఒకప్పుడు సామాన్యులే. అంబేద్కర్ కు బరోడా రాజు అండగా నిలబడ్డారు. ఆయనిచ్చిన 12 డాలర్ల డబ్బుతో లండన్ లో లా చేశాడు. రాజ్యాంగం రచించాడు. కలామ్ దేశమే గర్వించదగ్గర లీడర్ గా ఎదిగారు. . ఆయనకు ఒక అయ్యంగార్ అన్ని విషయాల్లో అండగా నిలబడ్డారు.. సమాజంలో పైకొచ్చిన 10 శాతం మంది కింద స్థాయిలో ఉన్న 20 శాతం మందిని ఆదుకోవాలి. 2029 నాటికి పేదరికం లేని సమాజాన్ని తయారుచేయడం నా లక్ష్యంగా పెట్టుకున్నాను. ఉగాది రోజున పీ4కు శ్రీకారం చుట్టాం. ఆగస్టు 15 నాటికి 20 లక్షల కుటుంబాల బాధ్యత తీసుకునే మార్గదర్శులను రెడీ చేస్తాం. ఒక మనిషగా సాటి మనిషికి సాయం చేయాలి. ఈ పవిత్ర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు.
*బంగారు కుటంబానికి ఎంపికైన సాయాపురం గ్రామస్థురాలు పార్వతి మాట్లాడుతూ*
నాకు నలుగురు పిల్లలు. వారిలో ముగ్గురు ఆడపిల్లలు. రెండేళ్ల క్రితం కరెంటు షాక్ కొట్టడంతో మా ఆయన ఆరోగ్యం పాడయ్యింది. ఆయన ఏం సంపాదించలేడు. కూలి పనికి వెళ్లి నేనే కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఉండటానికి ఇల్లు ఇచ్చి, మా ఆయనకు ఉపాధి కల్పించమని సీఎం గారిని కోరుతున్నాను.
*సీఎం చంద్రబాబు:* పార్వతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇల్లు కట్టిస్తాం. ఆమె నలుగురు పిల్లలకు ఒకొక్కరికి రూ. లక్ష డిపాజిట్ చేస్తాం. తల్లికి వందనం కింద రూ. 15 వేలు ఇస్తాం. ఆమెకు ఉపాధి, ఆమె భర్తకు ఉద్యోగం ఇచ్చే బాధ్యత మార్గదర్శులు తీసుకోవాలి.
*అనంతయ్య, మార్గదర్శి*
రూ. 5 వేల పెట్టుబడితో వ్యాపారం మొదలుపెట్టి రూ. 250 కోట్ల టర్నోవర్ స్థాయికి నేను చేరాను. 20 ఏళ్లుగా నేను సేవా కార్యక్రమాల్లో ఉన్నాను. వందలాది కుటుంబాలను బంగారు కుటుంబాలుగా తయారుచేశాను. అలాంటి వారిలో ఒకరు ప్రస్తుత అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్. పార్వతి కుటుంబానికి అన్ని విధాలా సాయం చేస్తాం. ఆమె భర్తకు మా కపెంనీలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం ఇస్తాం. పిల్లలు ఎంతవరకూ చదువుకున్నా ఆ ఖర్చులు భరిస్తాం.
*రామకృష్ణ, మార్గదర్శి*
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా 1500 మంది విద్యార్థులతో ప్రాజెక్టు చేస్తున్నాం. చాయాపురంలో 15 కుటుంబాలను నేను దత్తత తీసుకుంటాను.
*******************