విన్నంతనే విషాదానికి కూరుకుపోయేలా చేసిన ఎయిరిండియా విమాన ప్రమాద ఉదంతం గురించి తెలిసిందే. ఈ దారుణ దుర్ఘటనకు సంబంధించిన ఉదంతాలు ప్రతి ఒక్కరిని విషాదానికి గురి చేస్తున్నాయి. అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఈ విషాదంతోఅందరిని కలిచివేస్తోంది. అయితే.. ఈ ఘోర విషాదానికి సజీవ సాక్ష్యంగా నిలిచే వీడియో ఒకటి క్షణాల్లో వైరల్ గా మారటం తెలిసిందే. ఈ దారుణానికి సంబంధించిన వార్తల వేళ.. ఈ వీడియోను ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇంతకూ ఈ వీడియోను తీసిందెవరు? అసలు ఆ వీడియోను ఎందుకు ఘూట్ చేశారు? లాంటి సందేహాలు వ్యక్తమైన పరిస్థితి. దీనికి సమాధానం తాజాగా లభించింది. ఈ వీడియోను తీసింది పదిహేడేళ్ల కుర్రాడిగా గుర్తించిన పోలీసులు అతడి నుంచి వాగ్మూలాన్ని రికార్డు చేశారు. ఎయిర్ పోర్టుకు సమీపంలోని అద్దె ఇంట్లో అతడి కుటుంబం ఉంటుంది. అతడి పేరు వాసు (మైనర్ కారణంగా పేరు మార్చటం జరిగింది). ఈ కుర్రాడికి టేకాఫ్ అయ్యే విమానాల వీడియోలు తీయటం సరదా.ఇదే క్రమంలో జూన్ 12న వీడియోలు తీస్తున్న సమయంలో ఊహించని విధంగా ఎయిరిండియా విమాన కూలిన ఘటన చోటు చేసుకుంది. వీడియో రికార్డు మొదలైన పద్నాలుగు సెకన్లకే విమానం కుప్పకూలినట్లుగా వాసు చెప్పాడు. ఈ ఘటనను కళ్లారా చూసిన తాను తీవ్రంగా భయపడినట్లుగా మీడియాకు చెప్పాడు. ‘వీడియో రికార్డు మొదలు పెట్టిన 14 సెకన్లకే విమానం కుప్పకూలింది. ఈ విషయాన్ని నా సోదరికి చెప్పా. ఆమెకే ఈ వీడియోను మొదట చూపించా. ఆమె మా నాన్నకు చెప్పింది. ఆ విమానం కూలిపోతుందన్న విషయం నాకు తెలియదు’’ అని వెల్లడించాడు.
ఈ వీడియో తీసిన తన సోదరుడి మానసిక పరిస్థితి గురించి ఆమె సోదరి మీడియాతో షేర్ చేసుకున్నారు. ‘ఈ ఘటన అత్యంత ప్రమాదకరంగా మారటంతో అక్కడ ఉండకూడదని ఆర్యన్ అనుకున్నాడు. భయంతో సరిగా మాట్లాడలేకపోయాు. ఆ రాత్రంతా మేల్కొనే ఉన్నాడు. ఏమీ తినలేదు. మౌనంగా ఉండిపోయాడు’ అని పేర్కొన్నారు. వీడియో తీసిన ఆర్యన్ గురించి ఇంటి యజమాని మాట్లాడుతూ.. ఆ కుర్రాడు తీవ్ర భయాందోళనలకు గురైనట్లుగా చెప్పారు.అయితే.. ఆర్యన్ ను పోలీసులు అరెస్టు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వేళ పోలీసులు స్పష్టత ఇచ్చారు. వీడియో తీసిన మైనర్ ను అరెస్టు చేసినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని.. వీడియో చిత్రీకరణకు సంబంధించిన వివరాల్ని సదరు బాలుడే వెల్లడించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. తండ్రితో పాటు స్టేషన్ కు వచ్చి తన స్టేట్ మెంట్ ను ఇచ్చాడని.. అనంతరం తన తండ్రితో వెళ్లిపోయినట్లుగా చెప్పారు. ఎలాంటి అరెస్టులు జరగలేదని స్పష్టం చేశారు.
అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమానం ఘోర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 274 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో విమానంలో ఉన్న 242 మందిలో 241, బయట ఉన్న వారిలో 33 మంది ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై భారత్ తో పాటు ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్నవారే కాకుండా.. సమీపంలోని బీజీ వైద్య కళాశాల హాస్టల్ భవనంలో భోజనానికి కూర్చున్న వైద్య విద్యార్థులు మృతి చెందడం ఈ విషాదాన్ని రెట్టింపు చేసింది. అయితే… విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించగా.. ఒక వ్యక్తి 39 ఏళ్ల బ్రిటిష్ ఇండియన్ విశ్వాస్ కుమార్ రమేష్ మృత్యుంజయుడిగా నిలిచారు.
ప్రమాదంలో విమానంలో ఉన్న అందరూ చనిపోగా అతడు మాత్రం స్వల్ప గాయాలతోనే బయటపడటం విశేషం. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాను ఎలా బ్రతికి పయటపడ్డానో తనకు తెలియడం లేదని విశ్వాస్ అంటున్నారు. విమానం ముక్కలవ్వడంతో తన సీటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఎగిరి బయట పడిందని చెబుతున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యుల డీ.ఎన్.ఏ లతో పోల్చి మృతదేహాలను అప్పగించే పనిలో వైద్యులు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఉన్నారు. ఇప్పటివరకూ తొమ్మిది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెబుతున్నారు. మరోవైపు.. విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికులకు టాటా సంస్థ రూ. కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించగా.. తాజాగా ఎయిరిండియా స్పందించింది. అవును… విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున టాటా సంస్థ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ విషయంపై ఎయిరిండియా సంస్థ కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా… టాటా సంస్థ ఇస్తున్న రూ.కోటితో పాటు మరో రూ.25 లక్షలు అందజేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియాకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు వీలుగా మూడేళ్ల క్రితం కొనుగోలు చేసింది టాటా గ్రూపు. అప్పుట్లో కూరుకుపోయిన ఈ విమానయాన సంస్థను తిరిగి గాడిన పడేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. నిర్వహణ చికాకులతో ఇబ్బంది పడుతున్న ఎయిరిండియాకు తాజాగా అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న అతి పెద్ద విమాన ప్రమాదం సవాళ్లను మరింత పెంచే పరిస్థితి.
ప్రస్తుతం ఎయిరిండియా వద్ద 197 విమానాలు ఉండగా.. ఇందులో 27 విమానాలు 10 – 15 ఏళ్ల నాటి విమానాలు. ఇక.. 43 విమానాలు 15 ఏళ్ల కంటే ఎక్కవ కాలం పాటు సర్వీసులో ఉన్న విమానాలు. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ వద్ద ఉనన 101 విమానాల్లో 37 శాతం 15 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న విమానాలు కావటం గమనార్హం. నిపుణుల వాదన ప్రకారం చూస్తే అహ్మదాబాద్ దుర్ఘటనలో కూలిన డ్రీమ్ లైనర్ విమానం 11 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. ఇది పాతికేళ్ల నుంచి ముప్ఫై ఏళ్ల వరకు సేవలు అందిస్తుందని చెబుతున్నారు. 2014లో ఈ విమాన డెలివరీ అందుకున్న కమాండర్ చెప్పినట్లుగా చెబుతారు.
అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను 2022 జనవరిలో కేంద్ర ప్రభుత్వం నుంచి టాటా గ్రూపు తన చేతుల్లోకి తీసుకుంది. అంతర్జాతీయ పోటీ సంస్థలతో పోటీ పడేలా ఎయిరిండియాను తీర్చి దిద్దాలని ప్లాన్ చేసి.. అందుకు తగ్గట్లుగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో సంస్థకు పలు విధాలుగా సమస్యలు ఎదురవుతున్నాయి. సిబ్బంది వ్యవహరించే తీరు.. వారి పని పరిమితులు.. సాంకేతిక సమస్యలు.. తరచూ ఏదో ఒక పంచాయితీని తెచ్చి పెడుతోంది. ఇది సరిపోదన్నట్లు కశ్మీర్ అంశంపై ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విమానాలు పాక్ గగనతలం మీదుగా ఎగరకూడదన్న ఆంక్షలు విధించటం తెలిసిందే. దీంతో.. అంతర్జాతీయ సర్వీసులకు చుట్టూ తిరిగి వెళ్లటం ద్వారా.. ఎయిరిండియాకు ఏడాదికి జరిగే ఆర్థిక నష్టం 600 మిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఎయిరిండియా పాత విమానాల్లోని లోపలి భాగాల నవీకరణకు 400 మిలియన్ డాలర్లు గ్రూపు కేటాయించినా.. వాటికి అవసరమైన పరికరాల సరఫరా ఆలస్యం అవుతోంది. దీంతో తాను అనుకున్న ప్లాన్ ను అనుకున్నట్లుగా అమలు చేయలేని పరిస్థితి. సమయ పాలన విషయంలోనూ తరచూ ఫిర్యాదుల్ని ఎదుర్కొంటోంది. 2024లో సగటున 46 నిమిషాల ఆలస్యంతో బ్రిటన్ లో టైమింగ్ విషయంలో అధ్వాన విమానయాన సంస్థగా ఎయిరిండియా నిలిచింది. తాజా దుర్ఘటన నేపథ్యంలో జరిగే దర్యాప్తు.. అందులో బయటకు వచ్చే అంశాలే ఎయిరిండియా ఫ్యూచర్ కు కీలకంగా మారతాయని చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.