టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబం ఇంటి ముఖం చూసి వారం రోజులు అయిందట. ఈ వారం రోజులుగా వారు ప్రజల మధ్యే ఉంటున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అయితే వారం కాదు, పది రోజులుగా ఇంటి ముఖం చూడలేదని అంటున్నారు.
ఎంత బిజీగా ఉన్నప్పటికీ, విదేశాల్లో ఉంటే తప్ప ఏపీలో ఉన్నప్పుడు వారాంతంలో సీఎం చంద్రబాబు, నారా లోకేష్లు హైదరాబాదుకు వెళ్లి కుటుంబంతో ఒక్కరోజైనా గడుపుతారు. కానీ ఈసారి గత పది రోజులుగా చంద్రబాబు, మంత్రి లోకేష్లు ఇంటి ముఖం కూడా చూడలేదని పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక నారా భువనేశ్వరి కూడా గత వారం కేవలం రెండు రోజులపాటు మాత్రమే ఇంటికి వెళ్లారట. మరి వారు ఏం చేశారన్నది ఆసక్తిగా మారింది. లండన్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు దంపతులు తిరిగి వచ్చాక ఇంటికి వెళ్లాలని అనుకున్నారు. కానీ రాష్ట్ర రాజకీయ పరిణామాలు, వైసీపీ చేసిన విమర్శలు, రైతులకు వచ్చిన నష్టం వంటి పరిణామాల కారణంగా చంద్రబాబు లండన్ నుంచి నేరుగా ఉండవల్లికి వచ్చేశారు.
ఆ వెంటనే ఆయన సచివాలయానికి వెళ్లి పలు సమీక్షలు నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఇదే సమయంలో భువనేశ్వరి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా కుప్పంలో జరిగిన కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. దీంతో వారిద్దరూ వారం రోజులుగా దాదాపు ఇంటి ముఖం చూడలేదు.
ఇక నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని వచ్చాక ఇంటికి వెళ్లి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామనుకున్నారు. కానీ అదే రోజు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన జరిగి, వెంటనే శ్రీకాకుళానికి వెళ్లారు. ఆ తర్వాత కూడా ఇంటికి వెళ్లే అవకాశం రాలేదు. పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించిన తర్వాత అనంతపురంలో పర్యటనకు వెళ్లి రెండు రోజులు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఇలా గత పది రోజులుగా నారా లోకేష్ సహా చంద్రబాబు కుటుంబం ఇంటి ముఖం చూడకుండానే ప్రజల మధ్యే ఉండటం గమనార్హం.


















